కార్మిక సంఘాల్లో సింగరేణి వేడి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌30 : సింగరేణి సంస్థలో అక్టోబర్‌ 5వ తేదీన జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు అన్ని కార్మిక సంగాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ ఎన్నికలను అధికార తెబొగకాసం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అప్పుడే ప్రచారం మొదలు పెట్టింది. సంఘం గౌరవాధ్యక్షురాలు ఎంపి కవిత నాయకులతో మాట్లాడి వ్యూహాలు సిద్దం చేశారు. ఇకపోతే ఎఐటియూసి సహా ఇతర నేతలు కూడా రంగంలోకి దిగారు. ఈ ఎన్నికలు తెలంగాణలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న 11 ఏరియాల్లోని సింగరేణి కార్మికులతో పాటు, కోల్‌బెల్టు ప్రాంతంతో ముడిపడి ఉన్న అన్ని రంగాలను ప్రభావితం చేసే విధంగా ఉన్నందున గుర్తింపు ఎన్నికల గురించే ఆసక్తి కరమైన చర్చలు జరుగుతున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న టీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ ఎన్నికల వ్యూహ రచనలో నిమగ్నమైంది. కోల్‌బెల్టు ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భాగస్వాములను చేస్తూ టీబీజీకేఎస్‌ నుంచి సమన్వయ కమిటీల ఏర్పాటు ద్వారా ప్రజాప్రతినిధులను బాధ్యులుగా నియమించి

ఎన్నికల సమరంలో నిలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణ ఏర్పాటైన తరువాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో టీబీజీకేఎస్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత సారధ్యంలో ఎన్నికల్లో విజయం సాధించేందుకు పావులు కదుపుతున్నారు. హైదరాబాద్‌లోని ఆర్‌ఎల్‌సీ కార్యాలయంలో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపై యాజమాన్యంతో చర్చించారు. పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, పోలింగ్‌కు అవసరమైన సిబ్బంది, కౌంటింగ్‌ తదితర అంశాలపై చర్చించి చేపట్టాల్సిన పనులపై పరస్పరం చర్చించారు. /ఖ/-/ఖ/రిళి/ూ/ుగ్గు/ద సింగరేణి సంస్థలో అక్టోబర్‌ 5న జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణలో కేంద్ర కార్మికశాఖ అధికారుల ఆదేశాలకు అనుగుణంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల జీఎంలు ఎన్నికల పక్రియ నిష్పక్షపాతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్‌ (పా అండ్‌ పైనాన్స్‌) జే.పవిత్రన్‌కుమార్‌ ఆదేశించారు. ఏరియాల వారీగా మూడు రీజియన్లకు సమన్వయ అధికారులను నియమించారు. కొత్తగూడెం రీజియన్‌కు ఏరియా జీఎం కేవీ రమణమూర్తి, రామగుండం రీజియన్‌కు ఆర్జీ1 ఏరియా జీఎం విజయపాల్‌రెడ్డి, బెల్లంపల్లి రీజియన్‌కు శ్రీరాంపూర్‌ జీఎం ఎస్‌కే సుభాని ఎన్నికల నిర్వహణ బాధ్యతను పర్యవేక్షిస్తారని పవిత్రన్‌కుమార్‌ ప్రకటించారు.