కాలువలోకి దూసుకెళ్లిన కారు

` మహిళలు, చిన్నారులు సహా ఏడుగురు మృతి
` మరో ప్రమాదంలో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్రక్కు
– ఒకరు మృతి, 18 మంది తీవ్రగాయాలు
` రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదాలు
జైపుర్‌(జనంసాక్షి):రాజస్థాన్‌ లోని జైపుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరిద్వార్‌ నుంచి వస్తున్న ఓ కారు కాలువలో పడి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. శనివారం రాత్రి హరిద్వార్‌నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. జైపుర్‌లోని శివదాస్‌పుర పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ప్రహ్లాద్‌?పుర సమీపంలోని రింగ్‌ రోడ్డు కింద ఉన్న కాలువలో కారు పడిపోయింది. వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి రింగ్‌ రోడ్‌ పై నుంచి దాదాపు 16 అడుగుల కిందకు పడిపోయిందని అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కారులోని ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుండగా, ఆదివారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో ఓ యువకుడు కాలువలో పడి ఉన్న కారును చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీనితో డీసీపీ సౌత్‌ రాజర్షి రాజ్‌ వర్మ సహా ఇతర అధికారులు ఘటనాస్థలానికి వెళ్లారు. హుటాహుటిన కారును కాలువలోంచి బయటకు తీయించారు. కారులో ఉన్న మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మృతులంతా హరిద్వార్‌?లో అస్థికలు కలపడం కోసం వెళ్లి, తిరిగి ఇంటికి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషాధ ఘటనలో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతి చెందారు. వీరంతా జైపుర్‌లోని ఫులియావాస్‌ కేక్రి, వాటికకు చెందినవారుగా తెలుస్తోందని చక్సు ఏసీపీ సురేంద్ర సింగ్‌ తెలిపారు.మృతుల్లో సింగనేర్‌కు చెందిన రామ్‌రాజ్‌ వైష్ణవ్‌, అతని భార్య మధు, వారి కుమారుడు రుద్ర ఉన్నారు. అజ్మీర్‌లోని కేక్రీకి చెందిన రామరాజ్‌ బంధువు కలురామ్‌, ఆయన భార్య సీమ, వారి కుమారులు రోహిత్‌, గజరాజ్‌ ఉన్నారని పోలీసులు తెలిపారు.పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం, ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న రామరాజ్‌ తమ బంధువు చితాభస్మాన్ని హరిద్వార్‌? వద్ద గంగానదిలో కలపడానికి వెళ్లారు. ఆయన కుటుంబంతో పాటు కలురామ్‌ భార్య, పిల్లలు కూడా హరిద్వార్‌కు వెళ్లారు. వారు జైపుర్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్రక్కు..
రాజస్థాన్‌లోని ధోల్పూర్‌లో శనివారం ఖాటుశ్యామ్‌ నుంచి తిరిగి వస్తున్న ట్రాక్టర్‌ ట్రాలీని ఓ ట్రక్‌ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీనితో ఒక వ్యక్తి మరణించగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనితో వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితులు అంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.‘శనివారం తెల్లవారు జామున కదం ఖాండి హనుమాన్‌ ఆలయంలో సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఖాటు శ్యామ్‌ను దర్శించుకున్న తరువాత వీరంతా ట్రాక్టర్‌ ట్రాలీలో తిరిగి మధ్యప్రదేశ్‌కు వెళ్తున్నారు. ట్రాక్టర్‌లో పిల్లలు, మహిళలు, పురుషులు ఉన్నారు. ట్రాక్టర్‌ ట్రాలీని హైవే పక్కన ఆపి కొందరు మూత్ర విసర్జనకు వెళ్లారు. ఆ సమయంలోనే భరత్‌?పూర్‌? వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు చాలా బలంగా ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీనితో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. యాద్‌ రామ్‌ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ప్రమాదం జరిగిన తరువాత ట్రక్కు డ్రైవర్‌ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి, అతని కోసం గాలిస్తున్నారు’ అని ఏఎస్‌ఐ అజయ్‌ సింగ్‌ తెలిపారు.