కుక్కల దాడిలో విద్యార్థినికి తీవ్ర గాయాలు

వరంగల్‌, సెప్టెంబర్‌27  (జనంసాక్షి):  ఇంజినీరింగ్‌ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్‌ సెంకండియర్‌ చదువుతున్న ఓ విద్యార్థినిపై కాలేజీలోని కుక్కలు ఒక్కసారిగా దాడిచేశాయి. దీంతో ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని బాలాజీ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.  రమ్య అనే విద్యార్థిని బాలాజీ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ సెంకండియర్‌ చదువుతోంది. కాలేజీ హాస్టల్‌లో ఉంటున్న రమ్యపై శుక్రవారం కాలేజీలో ఉండే కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన రమ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలేజీలో ఫ్రెషర్‌ డే నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై కుక్కలు దాడి చేసి.. తీవ్రంగా గాయపర్చడం విద్యార్థులను ఆందోళనకు గురిచేసింది. రమ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కాలేజీ ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు.