కొండా దంపతులకు సవాల్‌

పరకాలలో నిలవాలంటూ ధర్మారెడ్డి ఎద్దేవా
వరంగల్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): పరకాల నియోజవర్గం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌లో కొండా దంపతుల చేరికతో సవాళ్లు బయలుదేరాయి. ఇక్కడి తాజామాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి వారికి సవాళ్లు విసురుతున్నారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని అంటున్నారు. అయితే ఈసారి పరకాలలో నిలిచేది కొండా సురేఖ కావడం విశేషం.ఐదారు సీట్లు గెలిపించి రాహుల్‌కు కానుకగా ఇస్తామన్న కొండాదంపతులు అందుకు తగ్గట్లుగా పావులుకదుపుతున్నారు. మరోవపై వీరిని ఓడగొట్టేందుకు టిఆర్‌ఎస్‌ కూడా గట్టి అభ్యర్థలను రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మూడు నియోజకవర్గాల్లో తమకు గెలిచే సత్తా ఉందని అంటున్న కొండా దంపతులకు దమ్ము, ధైర్యం ఉంటే పరకాల నియోజకవర్గం నుంచి నాతో  పోటీకి రావాలి.. వారికి  ప్రజలు చెమటలు పట్టించడం కాదు ఈ సారి మట్టి కరిపించడానికి సిద్ధంగా ఉన్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి అన్నారు.  సంగెం మండల ప్రజలకు ఈ అవకాశం మరోమారు వచ్చిందని  ధర్మారెడ్డి అన్నారు. గుండాయిజం, రౌడీయిజం చేసేవాళ్లు, కాళ్లు మొక్కించుకునే నాయకులు ప్రజలకు అవసరం లేదన్నారు. గతంలో వంచనగిరి సమావేశంలో ఊరికో కొండా మురళి పుట్టాలని ఆయన కూతురు చెప్పారని, కానీ ఒక్కరితోనే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఊరికొకరు ఎందుకని ఎద్దేవా చేశారు.