కొడుకును సీఎం చేసేందుకే సెక్రటేరియట్‌ కూల్చివేత

– బీజేపీ నేత వివేకానంద
మంచిర్యాల, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్‌ సెక్రటేరియట్‌ను కూల్చివేస్తున్నారని బీజేపీ నేత గడ్డం వివేకానంద విమర్శించారు. జిల్లాలోని వెన్నెల మండల కేంద్రంలో అక్రమ కేసులకు గురైన 12మంది బీజేపీ కార్యకర్తలను ఎంపీటీసీ హరీశ్‌గౌడ్‌ ఇంటిలో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే దళిత నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాటిచ్చి మోసం చేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ తన కొడుకును ముఖ్యంత్రిని చేయటం కోసం సెక్రటేరియట్‌ను కూల్చి వేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ కేసీఆర్‌ ఓ తుగ్లక్‌ ముఖ్యమంత్రిగా వ్యవహిరిస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రతిభావంతులైన ఇంజనీర్లతో కాకుండా.. తనకు తొత్తులుగా వ్యవహరించే రిటైర్డ్‌ ఇంజనీర్లతో పని చేయిస్తూ ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తుమ్మిడిహెట్టి నుంచి ప్రవహించే ప్రాణహిత నీటిని కాళేశ్వరం ప్రాజెక్టులో పోస్తూ, మూడు విూటర్ల ఎత్తులో నీటిని పంపిణీ చేసూ ప్రభుత్వ సొమ్ముని దుబారా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీసులందరినీ తన పార్టీ  కార్యకర్తల్లా పనిచేయించుకుంటూ బీజేపీ నాయకులపై అక్రమంగా కేసులను వేస్తున్నారని వివేకా విమర్శించారు.

 

తాజావార్తలు