గడువులోగా మిషన్‌ భగీరథ పనులు పూర్తి

– రంగారెడ్డి జిల్లాలో రూ. 1960 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు

– మంత్రి మహేందర్‌ రెడ్డి

రంగారెడ్డి ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లాద్వారా నీరు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందని, రాష్ట్రంలో 2018 చివరి నాటికల్లా మిషన్‌భగీరథ పనులను పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లానీరు అందిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరంలో రూ. 52 కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ పైలాన్‌ పనులను, కొత్తూరులో రూ. 3కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెటింగ్‌ గోదాంను మంత్రి మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రం లో మహిళల కన్నీటి కష్టాలు లొలగించేందుకు సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ పథకంతో ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీటి సరఫరా చేయించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో

రూ. 1960 కోట్ల నిధులతో మిషన్‌ భగీరథ పనులు పకడ్బందీగా చేపట్టామని తెలిపారు. డిసెంబర్‌ నాటికి గ్రామాలకు మేయిన్‌ పైప్‌ లైన్స్‌ నిర్మాణం పనులు పూర్తవుతాయని తెలిపారు. రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కోట్లాది నిధులతో చర్యలు తీసుకుంటున్నారు. పత్తి రైతుల కోసం రాష్ట్రంలో 20 లక్షల క్యువ్‌ ఆర్‌ కోడ్‌ కార్డులు పంపిణీకి సిద్దం చేయగా ఉమ్మడి జిల్లాలో లక్ష్యా 60 వేల మంది రైతులకు కార్డులను అందించనున్నామన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ. 69 కోట్ల నిధులతో గోదాంలను నిర్మించామని మంత్రి తెలిపారు. రైతులకు లోటు లేకుండా ఎరువులు, విత్తనాలు , ఎకరాకు 4 వేల పెట్టుబడులు రెండు పంటలకు అందించటం, పండిన పంటకు మద్దతు ధరలు అందించి వ్యవసాయంను పండుగలా మారుస్తామన్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఏ తీగల కృష్ణారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.