గిరిజన గురుకుల పాఠశాల ఘటనపై కొరడా ఝులిపించిన ఆర్ సి ఓ సంపత్ కుమార్

– నలుగురికి మెమోల జారీ
ఎల్లారెడ్డి ఆగస్టు 22 జనం సాక్షి : ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ పై రీజనల్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్ కొరడా ఝలిపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం రాత్రి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంఘటన జరిగిన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని మెస్ ను సందర్శించి వంట పాత్రలను, గదులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇందుకు బాధ్యులైన ప్రిన్సిపల్, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్,  వంట నిర్వాహకులకు మెమోలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థినిలు సమయపాలన పాటించి భోజనం చేయాలని ఆలస్యంగా భోజనం చేయడం వల్లే ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. పాఠశాలలో తిరిగి ఇలాంటి సంఘటనలు తలెత్తితే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.