చర్లపల్లి జైలులో అధికారుల ఇష్టారాజ్యం

హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): చర్లపల్లి జైలులో అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. నిబంధనలకు నీళ్లొదులుతూ నియంత్రణ లేని విధంగా వ్యవహారాలు నడుస్తున్నాయనడానికి ఇటీవల జరిగిన పలు సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా కత్తెరతో ఒక ఖైదీ తోటి ఖైదీపై దాడి చేసి హత్య చేసిన సంఘటన సంచలనం కలిగించింది. దీనిపై రాయలసీమ రేంజ్‌ డీఐజీ జయవర్ధన్‌ విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన జరిపిన తనిఖీలలో భాగంగా పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఖైదీలతో కలిసి జైలు అధికారి ఒకరు రియల్‌ ఎస్టేట్‌ సెటిల్‌మెంట్లు చేస్తున్నట్టు వెలుగుచూసింది. ఈ తతంగంపై డీఐజీ జయవర్ధన్‌ ఆ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఆయనపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఖైదీ వెంకటయ్యతో కలిసి తన గదిలోనే ఆ అధికారి భూ దందాలకు పాల్పడినట్టు డీఐజీ పరిశీలనలో వెల్లడైంది.