జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి, నవంబర్ 18, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో శుక్రవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కెల్ల అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని అన్నారు. దాతల సహకారంతో ఈకార్యక్రమం గత ఏడాది ఏప్రిల్ 13న ప్రారంభించామని, వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేటితో 139వ సారి అన్నదానం చేసినట్లు తెలిపారు. నేటి కార్యక్రమం ఇప్ప శ్వేతా – రాజు దంపతుల కుమారుడు సాయి రేయాన్ష్ పుట్టినరోజు సందర్బంగా యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు, చిరు వ్యాపారులకు, బాటసారులకు ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదానం చేసినట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమం ద్వారా సుమారు 180 మందికి అన్నదానం చేశామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని, ఇప్పటిదాకా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు, జనహిత సేవా సమితి సభ్యులు పాయవేణి మల్లేష్, నిచ్చకోలా గురుస్వామి, కందుల రాజన్న, అక్షయ్ పాల్గొన్నారు.