*జర్నలిస్ట్ జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

*: మందడి చిరంజీవి
పెబ్బేరు జూలై 16 ( జనంసాక్షి ):
విధి నిర్వహణలో అమరుడైన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం ఆదుకోవాలని నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.శనివారం పెబ్బేరు పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో విధి నిర్వహణలో అమరుడైన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమీర్ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. జగిత్యాల జిల్లాలో వరదలు కవరేజ్ చేయడానికి వెళ్లి వాహనంతో రిపోర్టర్ జమీర్ వరద ఉధృతిలో కొట్టుకోపోవడం బాధాకర విషయమని, ఇలాంటి విపత్కర సమయంలో జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకొని విధులు నిర్వహించాలని అన్నారు.ఈ సందర్భంగా నాజా జిల్లా అధ్యక్షులు మందడి చిరంజీవి మాట్లాడుతూ…
ప్రమాదవశాత్తు మృతి చెందిన జర్నలిస్ట్ లను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వార్తా సేకరణలో ఎంతో మంది జర్నలిస్టులు అసువులు బాసారని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఇప్పటివరకు ఆదుకోలేదని అన్నారు. జమీర్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.అలాగే సంభందిత ఛానెల్ యాజమాన్యం సైతం తమ వంతు సహాయాన్ని అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు. వరదల సమయంలో వార్త సేకరణకు ప్రాధాన్యతని ఇస్తూనే తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.జమీర్ కుటుంభానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.కార్యక్రమంలో నాజా సభ్యులు బుచ్చన్న,పెద్ది గారి స్వామి,రాఘవేందర్ గౌడ్,నందీశ్వర్,శివకుమార్,తరుణ్,ఉమాశంకర్,శివరాజు,గాడిమూడి మన్యం,నారాయణ తదితరులు పాల్గొన్నారు