జిల్లాలో ఆరని అసంతృప్తి జ్వాలలు

గ్రామాల్లో దూసుకుని పోతున్న నేతలు
కానరాని ఉమా మాధవరెడ్డి  ప్రచారం
యాదాద్రి,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అసంతృప్తుల వేడి తాకుతోంది. మరోవైపు పార్టీలో చేరిన మాజీమంత్రి ఉమామాధవరెడ్డి వర్గం ఇంకా సైలెంట్‌గానే ఉంది. ఆమె కానీ , ఆమె అనుచరులు కానీ ప్రచార కార్యక్రమాల్లో కానరావడం లేదు. అయినా ముందుకు వెళ్తున్న అభ్యర్థులకు అసంతృప్తుల నుంచి ఎదురవుతున్న సవాళ్లు తలనొప్పిగా మారాయి. దీంతో అసంతృప్త నేతలను గుర్తించడంతోపాటు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. అసంతృప్తులను బుజ్జగించి అనుకూలంగా మార్చుకోవాలని అభ్యర్థులకు అంతర్గతంగా ఆదేశాలు అందినట్లు సమాచారం. అయితే ఎన్నికలకు సమయం ఉన్నందున దారిలో తెచ్చుకుంటామన్న ధీమాలో అభ్యర్థులు ఉన్నారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల ప్రచారం జిల్లాలో రోజురోజుకూ ఊపందు కుంటోంది. జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఆపార్టీ అభ్యర్థులు ప్రచార కార్యక్రమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఆలేరులో మోత్కుపల్లి దిగితే సవిూకరణాలు మారుతాయని అంటున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రచారంలో ఉన్న అభ్యర్థులకు ఫోన్‌లు చేసి దూకుడు పెంచాలని కోరడంతో వారు మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు అసంతృప్త నాయకుల విమర్శనాస్త్రాలను ఎదుర్కొంటూనే ఉన్నారు.
ప్రతిపక్షాలు ఇంకా అభ్యర్థులను ప్రకటిం చకపోవడంతో అధికార పార్టీ అభ్యర్థుల్లో కొంత సస్పెన్స్‌ కొనసాగుతోంది. తమతో పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరన్న ఆత్రుతతో వారు ఉన్నారు. అయితే ప్రచార కార్యక్రమాన్ని హంగూ ఆర్భాటంతో పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోని ఓటర్లను ఆకట్టుకోవడానికి వివిధ రూపాల్లో ప్రచారం చేపట్టారు. గ్రామాలను గులాబీమయం చేస్తూ బైక్‌ ర్యాలీలు, యువజన విద్యార్థి సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున చేరికలను ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తూ గ్రామాలను చుట్టి వస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఆత్మకూరు, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, ఆలేరు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో సభలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, భువనగిరి ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి మండలాల వారీగా ఎంపిక చేసుకున్న గ్రామాలకు వెళ్లి అక్కడ ప్రభుత్వం చేసిన అభివృద్ధితోపాటు పైళ్ల ఫౌండేషన్‌ ద్వారా తాను వ్యక్తిగతంగా చేసిన పనులను వివరిస్తూ మరోసారి ఆశీర్వదించమని కోరుతున్నారు. అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలను ఆయన అనుచరులు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధికి తోడు మరింత అభివృద్ధి కోసం తనను మరోసారి గెలిపించాలని ఓట్లు అడుగుతున్నారు.