టిఆర్‌ఎస్‌తోనే రాష్ట్రంలో అభివృద్ది

ఎండల కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రతి ఒక్కరూ ఓటేసేలా చూడాలి
కార్యకర్తలకు పెద్ది సూచన
వరంగల్‌,మే3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేయాలన్నారు. కొత్తపాత తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పదవులు రాని వారెవ్వరు నిరాశకు లోనుకావొద్దన్నారు. వారికి త్వరలో మంచి భవిష్యత్‌ ఉంటదన్నారు. కాగా, వివిధ గ్రామాల నుంచి ఆయాయ పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత రానున్న నాలుగున్నర సంవత్సరాల కాలం మొత్తం అభివృద్ధి పనులదేనని ఆయన చెప్పారు. గ్రామాల్లో అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేయించేలా చేస్తామని తెలిపారు. రానున్న పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ
ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు పట్టుదలతో పనిచేయాలని పిలుపు నిచ్చారు. ఎంపీటీసీకి పడిన ఓట్లు తప్పకుండా జెడ్పీటీసీకి పడేవిధంగా కార్యకర్తలు చూడాలని, ఒక్క ఓటు కూడా క్రాస్‌ పడకుండా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. అన్ని ఎంపీపీ, జెడ్పీచైర్మన్‌ పదవుల్లో గులాబీ జెండాను ఎగురవేసేలా చూడాలని ఆయన కోరారు. గ్రామాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రచారాలను ఉదయం, సాయంత్రం వేళల్లో చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎంతో శ్రమకోర్చి పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పథకాలు ఉన్నాయని వివరించారు. అలాంటి పథకాలతో లబ్ది పొందిన వారు కూడా అధికంగానే గ్రామాల్లో ఉన్నారని పేర్కొన్నారు. వారందరినీ టీఆర్‌ఎస్‌కు ఓట్లేయించేలా చూడాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందని తెలిపారు. నాయకుల అందరూ సమష్టిగా పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేసి, ఐక్యతను నిలుపు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.