తల్లి ఒడికి చేరిన శ్రాగ్వి
ఫ్యామిలీ ఫ్రెండ్సే కిడ్నాపర్లు.. : అనురాగ్శర్మ
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఎపిఇఎంఎస్):చిన్నారి శ్రాగ్వి కిడ్నాప్ ఉదంతానికి తెరపడింది. కిడ్నాప్ మిస్టరీని పోలీసులు చేధించారు. శ్రాగ్విని తల్లిదండ్రులకు అప్పగించారు. శ్రాగ్వి అంబర్పేట శివంరోడ్డులో శనివారం నాడు కిడ్నాప్నకు గురైన విషయం తెలిసిందే. నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నగర సీపీ అనురాగ్శర్మ మీడియాతో మాట్లాడారు. శ్రాగ్వి తల్లిదండ్రులకు సంబంధించిన ఫ్యామిలీ ఫ్రెండ్సే కిడ్నాప్నకు పాల్పడ్డారని తెలిపారు. రావుల భరత్, రావుల కృష్ణ అనే వారు శనివారంనాడు శ్రాగ్విని కిడ్నాప్ చేశారన్నారు. రావుల భరత్ రెడ్డిస్ లాబ్లో ఉద్యోగి అని, ఆయనకు పిల్లలు లేకపోవడంతోను, కుటుంబ సమస్యలతోను కిడ్నాప్నకు పాల్పడినట్టు భావిస్తున్నామన్నారు. రావుల భరత్ మానసిక స్థితి సరిగ్గా లేదని, కిడ్నాపర్లను విచారిస్తున్నామన్నారు. విచారణ అనంతరమే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. శ్రాగ్వి కిడ్నాప్ మిస్టరీని చేధించిన పోలీసులను అభినందిస్తున్నానని అన్నారు. శ్రాగ్వి కిడ్నాప్ సమయంలో పలు దుకాణాల్లోని సిసి కెమెరాల పుటేజిని, నాలుగు రోజులైనప్పటికి ఫోను చేయకపోవడం.. తదితర విషయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి కిడ్నాప్ మిస్టరీని చేధించారని తెలిపారు. అలాగే సినీ హీరోయిన్ అంజలి అదృశ్యంపై జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు నమోదైందని, పోలీసులు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారని అన్నారు. ఇదిలా ఉండగా శ్రాగ్వి తల్లిదండ్రులు దీక్షిత్, సృజన పోలీసులకు, సహకరించిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.