తహసీల్దార్ల ఎన్నికల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ల ఎన్నికల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లు సొంత జిల్లాలకు వెళ్లే విధంగా అవకాశం కల్పిచాలని తెలంగాణ తహసీల్దార్స్‌ అసోసియేషన్‌ (టిజిటిఏ) చేస్తున్న కృషి ఫలించింది. ఇప్పటికే ఇదే విషయమై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిసిఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌ను పలుమార్లు టిజిటిఏ నేతలు కలిసి ఎన్నికల బదిలీలపై వినతిపత్రాలను అందజేశారు. ఇటీవల రెవెన్యూ మంత్రితో జరిగిన ముఖాముఖి సందర్భంగా ఇదే విషయాన్ని టిజిటిఏ బలంగా చెప్పింది. ఎట్టకేలకు బదిలీలకు సంబంధించిన ఐచ్ఛికాలను ఇచ్చుకోవాలని తహసీల్దార్లకు అవకాశం ఇస్తూ సిసిఎల్‌ఏ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల టిజిటిఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రాములు, మహిళా అధ్యక్షురాలు పి.రాధ, ప్రధాన కార్యదర్శి రమేష్‌ పాక, సెక్రటరీ జనరల్‌ పూల్సింగ్‌ చౌహాన్‌ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి, సిసిఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌కు ధన్యవాదాలు తెలిపారు. అర్హత, ఆసక్తి, అవకాశం ఉన్న ప్రతి తహసీల్దార్‌ బదిలీకి అవకాశం కల్పించాలని టిజిటిఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్‌ పాక, సెక్రటరీ జనరల్‌ పూల్సింగ్‌ చౌహాన్‌ కోరారు. ఎన్నికల బదిలీల విషయంలో ఇప్పటికే కొంత జాప్యం జరిగిందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఎన్నికల సమయంలో బదిలీ అయిన ప్రతి తహసీల్దార్‌ సొంత జిల్లాలకు వెళ్లే విధంగా అవకాశం కల్పించాలన్నారు. ప్రతి ఒక తహసీల్దార్‌ బదిలీ అవకాశం కల్పించేందుకు టిజిటిఏ కృషి చేస్తుందన్నారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.