తినొచ్చు.. బయటనుంచి తెచ్చుకోవాలి

1

– బాంబే హైకోర్టు

ముంబయి,మే6(జనంసాక్షి): మహారాష్ట్రలో పశుమాంసం అమ్మకం, తినడం, జంతు వధపై నిషేధం కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దీనిపై నిషేధం  ఉన్నప్పటికీ రాష్ట్రం బయట నుంచి బీఫ్‌ తెచ్చుకోవడం అక్రమం కాదని బాంబే హైకోర్టు వెల్లడించింది. ఇదే సందర్భంలో రాష్ట్రంలో బీఫ్‌పై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే మహారాష్ట్ర బయట నుంచి తెచ్చుకుని బీఫ్‌ తినొచ్చని అది చట్టవిరుద్ధం కాదని స్పష్టంచేసింది. మహారాష్ట్రలో గత ఏడాది ప్రభుత్వం బీఫ్‌పై పూర్తి నిషేధం విధించింది. నిబంధనలు అతిక్రమిస్తే అయిదేళ్ల జైలు శిక్ష, రూ.పదివేల జరిమానా విధిస్తారు. బీఫ్‌ పూర్తి నిషేధాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. వాటి విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు పై విధంగా స్పందించింది. ముంబయి లాంటి మెట్రోపాలిటన్‌ నగరంలో భిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు ఉంటారని.. అలాంటి చోట బీఫ్‌ నిషేధించడం సరికాదని ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ నిషేధం ప్రజల ప్రాథమిక హక్కులను అతిక్రమిస్తోందని మరో పిటిషన్‌ దాఖలైంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆవు మాంసాన్ని నిల్వ చేయడం కానీ, తినడం కానీ తప్పుకాదని ఇవాళ ముంబై హైకోర్టు తీర్పును వెలువరించింది. గత ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం బీఫ్‌ వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. గో మాంసాన్ని అమ్మినా లేక గోవధ చేసినా చట్ట ప్రకారం నేరంగా పరిగణించింది. ఒకవేళ ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్లకు అయిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వ తీర్పును ఇప్పుడు ఆ రాష్ట్ర హైకోర్టు పాక్షికంగా రద్దు చేసింది. విశ్వనగరమైన ముంబైలో గో మాంస వినియోగంపై నిషేధం సరైంది కాదని కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అనేక సంస్కృతులు సమ్మిళితమయ్యే నగరంలో బీఫ్‌ బ్యాన్‌ ఆచరణీయంకాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దానిపై ముంబై కోర్టు స్పందిస్తూ వెరైటీ తీర్పును వెలువరించింది.