తెలంగాణపై దండయాత్రలు ..

మహబూబ్‌నగర్‌:  డిసెంబర్‌ 4,(జనంసాక్షి) :

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం వైకాపాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో సీమాంధ్ర గుండాలు విద్యార్థులపై దాడి చేశారు. ఆగ్రహం చెందిన యూనివర్సిటీ పైకి ఎక్కి రాళ్లు, కోడిగుడ్డు, టమాటలు పాదయాత్రపైకి విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల ప్రతిఘటనతో షర్మిల కొద్ది దూరం వరకు పాదయాత్ర ఆపేసి వాహనంలో వెళ్లిపోయారు. పోలీసులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు షర్మిల కాన్వాయ్‌పైన రాళ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు షర్మిలకు ఎంతగా భద్రత ఏర్పాటు చేసినా విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గలేదు. షర్మిల గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. జై తెలంగాణ అంటూ గళమెత్తి గర్జించారు. పోలీసులు ఎలాంటి అనుమతి లేకుండా విశ్వవిద్యాలయంలోకి చొరబడి విద్యార్థులను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. విద్యార్థులు పాలమూరు విశ్వవిద్యాలయం ముఖ ద్వారం ఎదుట షర్మిల దిష్టిబొమ్మ వేేలాడదీశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖరరరెడ్డి నంద్యాల ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను, జగన్‌ పార్లమెంట్‌లో సమైకాంధ్ర ప్లకార్డు పట్టుకున్న విషయాన్ని ఇక్కడి ప్రజలు మర్చిపోలేదని తెలిపారు. తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీలోకి చొరబడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణపై వైఖరి చెప్పకుండా యాత్ర కొనసాగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.