తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు

చలో అసెంబ్లీలో పాల్గొనండి
అల్లం నారాయణ
తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఈ ప్రాంత జర్నలిస్టులు ఉన్నారని, ప్రజల ఆకాంక్షలను రిపోర్ట్‌ చేయడంతో పాటు ఉద్యమంలోనూ భాగస్వాములు కావాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే చలో అసెంబ్లీకి కార్యక్రమానికి పది జిల్లాల నుంచి కలం యోధులు తరలిరావాలని కోరారు. తెలంగాణ సాధన కోసం జర్నలిస్టులు ఇంతకాలం సాగించిన పోరాటాలు ఒక ఎత్తయితే అసెంబ్లీ ఎదుట నిర్వహించనున్న పోరాటం మరో ఎత్తని పేర్కొన్నారు. పది జిల్లాల ప్రజలను ఇంతకాలం రికార్డ్‌, రిపోర్ట్‌ చేసిన జర్నలిస్టులు ప్రత్యక్ష పోరాటంలోనూ భాగస్వాములు కావాలని తెలిపారు. తెలంగాణ సాధన కోసం పది జిల్లాల ప్రజలు నాలుగు దశాబ్దాలుగా పోరాడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేయాలని ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఆయా శక్తులకు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని సూచించారు.