తెలంగాణ తల్లికి ఖండాంతర ఖ్యాతి
లండన్లో తెలంగాణ సాధనకు ప్రతిన బూనిన ఎన్ఆర్ఐలు
లండన్, (జనంసాక్షి) :
తెలంగాణ తల్లికి ఖండాంతర ఖ్యాతి దక్కింది. లండన్లో ఆదివారం రాత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫోరం వ్యవస్థాపకుడు గంప వేణుగోపాల్, నాయకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం శక్తి వంచన లేకుండా పోరాడుతామన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ రోజు చారిత్రాత్మకమైనదని, తెలంగాణ వెలుపల జరుగుతున్న ఉద్యమ హోరును లండన్లో ప్రతిష్టించిన తెలంగాణ తల్లి ప్రతిమ చాటి చెప్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము శక్తి వంచన లేకుండా పోరాడుతామని, తెలంగాణ ప్రజలందరికీ అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా పేద విద్యార్థుల కోసం నోట్పుస్తకాల పంపిణీకి నిధులు అందజేశారు. ఐదుగురు పేద ముస్లింల హజ్ యాత్రకు ఆర్థికసాయం చేశారు. కార్యక్రమంలో రంగుల సుధాకర్, పవిత్ర, అర్చన, సిక్కు చందూగౌడ్, ఉదయ్ నాగరాజు, మర్రి చందు, శ్యాం, శివాజీ, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.