తెలంగాణ సమగ్రాభివృద్ధే 

సీఎం కేసీఆర్‌ లక్ష్యం
– 24గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నాం
– రైతులకు పంట పెట్టుబడి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాసనే
– త్వరలో ఇంటింటికి మిషన్‌ భగీరథ నీరు
– భావితరాల బాగుకోసమే హరితహారం
– హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
– రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌
– పూట్నూర్‌లో రైతుకు  బీమా బాండ్లు అందజేసిన మంత్రి
కరీంనగర్‌, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, దీనిలో భాగంగానే అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పథకాలను అమలు చేస్తున్నట్ల ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. సోమవారం ఈటెల పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తొలుత పెద్దపల్లి పట్టణంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి మంత్రి ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. జయశంకర్‌ సార్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి పాలనలో కరెంట్‌ కోసం అనేక కష్టాలు పడ్డామని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో తెలంగాణలో అంధకారం నెలకొంటుందని పలువురు ఆంధ్రానేతలు పేర్కొన్నారని, కానీ కేసీఆర్‌ పట్టుదలతో తెలంగాణ వచ్చిన తరువాత రైతులకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని చెప్పారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని, అందుకే రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళికతో ముందకు సాగుతున్నారన్నారు. దీనిలో భాగంగా రైతులకు పంటపెట్టుబడి, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఇలాంఇ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని తెలిపారు. మిషన్‌ భగీరథ పనులు వేగంగాజరుగుతున్నాయని, త్వరలోనే మిషన్‌ భగీరథ నీటిని ఇంటింటికి మంచినీరు అందిస్తామని ఈటె లతెలిపారు. హరిత తెలంగాణతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించేలా కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 250కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించటం జరిగిందని, ఇప్పటికే 80కోట్ల మొక్కలు నాటడం జరిగిందన్నారు. నాల్గవ విడతలో మరో 40కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈటెల తెలిపారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నాటిన మొక్కలను రక్షించే బాధ్యతను తీసుకోవాలని ఈటెల కోరారు. అనంతరం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని పూట్నుర్‌ గ్రామంలో రైతులకు రైతు బీమా చెక్కులను పంపిణీ చేశారు. హరితహారంలో భాగంగా మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్‌ సత్యనారాయణ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కరీంనగర్‌ మండలం ముగ్ధుంపూర్లో రైతులకు బీమా పత్రాలు పంపిణీ చేశారు.
———————————-