నేతలకు రక్షణ కల్పిస్తాం
పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టుల దాడులపై ముందస్తు సమాచారముంది
అనారోగ్యంతో అమెరికాలో ఆగా : షిండే
న్యూఢిల్లీ, మే 30 (జనంసాక్షి) :
మావోయిస్టుల హిట్లిస్ట్లో ఉన్న నేతలకు పటిష్ట రక్షణ కల్పిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్కుమార్షిండే తెలిపారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు జరిపిన దాడిపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ విచారణను సమీక్షిస్తున్నామన్నారు. అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్లిన తాను కొంతకాలం అక్కడే ఉండాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పూణే సహా పలు పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టులు దాడి చేసే అవకాశముందనే ముందస్తు సమాచారం తమ శాఖ వద్ద ఉందన్నారు. మావోయిస్టుల హింసాఖాండను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. పకడ్బందీగా విచారణ నిర్వహించి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని పార్టీల నాయకులకు ప్రభుత్వపరంగా రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు.