పదవీవిరమణ చేసిన జస్టిస్ట్‌ నారిమన్‌


ఉద్విగ్నంగా సాగిన చివరి రోజు
ఓ న్యాయసింహాన్ని కోల్పోతున్నామన్న చీఫ్‌జస్టిస్‌ ఎన్‌వి రమణ
న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రోహింగ్టన్‌ ఫాలీ నారీమన్‌ గురువారం పదవీ విరమణ చేశారు. చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ జడ్జి ఆయనే. తన పదవీ కాలంలో జస్టిస్‌ నారీమన్‌ ఎన్నో చారిత్రక తీర్పులను వెలువరించడంలో భాగస్వామి అయ్యారు. తన పదవీకాలం చివరిరోజైన ఈరోజు సిజెఐ ఎన్‌వి రమణతో కలిసి కోర్టు హాల్‌ నంబర్‌`1లో కూర్చున్నారు. రిటైర్‌ అవుతున్న జడ్జిలు తమ చివరి రోజున ఈ హాల్లో కూర్చోవడం ఆనవాయతీగా వస్తోంది. జస్టిస్‌ నారీమన్‌కు వీడ్కోలు పలికే కార్యక్రమంలో ఎన్‌వి రమణ మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. మన బలమైన న్యాయ వ్యవస్థకు ఆయన కూడా ఒక మూలస్తంభం అని కొనియాడారు. ఆయన పదవీ విరమణ చేయడంతో న్యాయ వ్యవస్థ ఒక ఉన్నతమైన వ్యక్తిని, ఒక మేథావిని కోల్పోతుందని చెప్పారు. జస్టిస్‌ నారీమన్‌ ఎప్పుడూ సత్యం వైపే నిలబడ్డారని అన్నారు. తన కెరీర్లో మొత్తం 13,565 కేసులను వాదించారని గుర్తు చేశారు. నారీమన్‌ జ్ఞానాన్ని, మెధస్సును ఈ సంస్థ కోల్పోతుందన్నారు. బలమైన న్యాయవ్యవస్థలో ఆయన ఒక పిల్లర్‌ అన్నారు. నారీమన్‌ ఎల్లప్పుడూ న్యాయం వైపు నిలబడ్డట్లు సీజే చెప్పారు. ఈ క్షణం కొంత ఉద్విగ్నంగా ఉందని, నా ఆలోచనల్ని వ్యక్తపరచడం ఇబ్బందిగా ఉందని సీజే రమణ అన్నారు.
ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏను రద్దు చేసింది జస్టిస్‌ నారీమన్‌. హోమోసెక్స్‌పై ఇచ్చిన తీర్పులో ఆయన ధర్మాసనాన్ని పంచుకున్నారు. ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పునిచ్చారు. శబరిమల ఆలయం లోకి మహిళ ప్రవేశాన్ని అడ్డుకోరాదు అని ఓ తీర్పులో చెప్పారు. కస్టడీ మరణాల విషయంలో పోలీసు స్టేషన్లలో సీసీటీవీలు అమర్చాలని ఆదేశించారు. తాజా తీర్పులో రాజకీయ నేరచరితులకు వార్నింగ్‌ కూడా ఇచ్చారు. న్యాయవ్యవస్థను సింహంలా కాపాడిన జస్టిస్‌ నారీమన్‌ను కోల్పోతున్నామని సీజే రమణ తన పరసంగంలో పేర్కొన్నారు. జస్టిస్‌ నారీమన్‌ హార్వర్డ్‌ యూనివర్శిటీలో చదువుకున్నారు. 35 ఏళ్ల పాటు లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. ప్రముఖ న్యాయవాది ఫాలీ నారీమన్‌ కుమారుడే జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌. 37 ఏళ్ల వయసులోనే ఆయనను సీనియర్‌ న్యాయవాదిగా సుప్రీంకోర్టు గుర్తించింది. 2011లో సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా ఆయన నియమితులయ్యారు. భారత చరిత్రలో నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన ఘనత కేవలం ఆయనకు మాత్రమే దక్కింది.