పది జిల్లా కేంద్రాల్లో తెరాస ధర్నా

ఈటెల రాజేందర్‌
హైదరాబాద్‌,మే 5 (జనంసాక్షి) :
బయ్యారం ఉక్కును విశాఖకు తరలించి తీరుతామన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దురహంకార వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్‌ మండిపడ్డారు. ఆదివారం ఆయన బయ్యారం ఉక్కుపై కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల టీఆర్‌ఎస్‌ నేతలతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ఈనెల 10న తెలంగాణలోని పది జిల్లాల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ నిర్ణయించిందని  వివరించారు.

బయ్యారంపై ఎంతటి పోరాటానికైనా సిద్ధం : నాయిని

బయ్యారం ఉక్కు కోసం టీఆర్‌ఎస్‌ ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత నాయిని నర్సింహరెడ్డి తెలిపారు. బయ్యారం నుంచి ఒక్క ఉక్కు పెళ్లను కూడా విశాఖకు తరలించనీయబోమని హెచ్చరించారు. తెలంగాణ సహజ సంపదను సీమాధ్రకు తరలించుకుపోతానంటే చూస్తూ ఊరుకోబోమని, అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.