పార్లమెంట్‌లో ఆఖరిపోరాటం కొనసాగిస్తాం

టీ కాంగ్రెస్‌ ఎంపీలు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజల పక్షాన పార్లమెంట్‌లో ఆఖరిపోరాటం కొనసాగిస్తామని టీ కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంపీ డాక్టర్‌ గడ్డం వివేకానంద నివాసంలో ఎంపీలు మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, మాజీ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు భేటీ అయ్యారు. సోమవారం ప్రారంభం కానున్న మలి విడత బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎంత బలీయంగా కోరుకుంటున్నారో వారి తరఫున పార్లమెంట్‌లో చాటిచెప్తామన్నారు. సమావేశం అనంతరం మందా జగన్నాథం మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో  మరోసారి తెలంగాణ గళాన్ని వినిపిస్తామని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తాము చిత్తశుద్ధితో పోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రజల కోసం పనిచేస్తామని ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. కేంద్రం తెలంగాణ ఇవ్వకుంటే చేపట్టాల్సిన కార్యాచరణ, పార్లమెంట్‌ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలో మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎంపీలతో సమావేశమయ్యామని, సోమవారం మరోసారి భేటీ అయి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.