పోటాపోటీగా మల్లారెడ్డి, రేవంత్‌ల దిష్టిబొమ్మల దగ్ధం

హైదరాబాద్‌,అగస్టు26(జనంసాక్షి): టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌గా మారింది. పోటాపోటీగా దిష్టిబొమ్మలను ఇరు పార్టీలు దహనం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు మల్లారెడ్డిపై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కంటోన్మెంట్‌ బోర్డు ఏడో వార్డ్‌ మాజీ సభ్యుడు ప్యారా సాని శ్యామ్‌ కుమార్‌ అధ్వర్యంలో లాల్‌ బజారు చౌరస్తాలో రేవంత్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగుతున్నాయి. మేడ్చల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ నేతలు మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు.