పోరు సాగించు కేజ్రీవాల్‌ను పరామర్శించిన అన్నా హజారే

న్యూ ఢిల్లీ ,మార్చి 30 (జనంసాక్షి) :
విద్యుత్‌ బిల్లుల పెంపు, అవినీతికి వ్యతిరేకంగా పోరు కొనసాగించాలని అన్నా హజారే ఏఏపీ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ను కోరారు. పెరిగిన విద్యుత్‌ బిల్లులకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ చేపట్టిన నిరాహార దీక్ష ఎనిమిదో రోజుకు చేరింది. శనివారం ఆయన దీక్షను సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం హజారే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. దేశంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా దేశమంతా పర్యటించి ప్రజలను చైతన్య వంతులను చేస్తానన్నారు. ఉద్యమాల ద్వారానే హక్కులు సాధించుకోవచ్చని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ చేపట్టిన దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలన్నారు. అనంతరం 1,00,396 మందితో పెరిగిన బిల్లులు చెల్లించలేమని ప్రతిజ్ఞ చేయించారు. కాగా, కేజ్రీవాల్‌ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.