ప్రతిభావంతులకు ‘పద్మా’లు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5(ఎపిఇఎంఎస్‌):రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి ‘పద్మ’ అవార్డులను ప్రతిభావంతులకు అందజేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాలులో అవార్డుల ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది. పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన ప్రతిభావంతులకు రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేశారు. ప్రముఖ క్రికెటర్‌ రాహుల్‌ ద్రావిడ్‌, ప్రముఖ నిర్మాత రామానాయుడు పద్మభూషణ్‌ అవార్డులను స్వీకరించారు. అలాగే ప్రముఖ దర్శకుడు బాపు, ప్రముఖ నటి శ్రీదేవి ‘పద్మశ్రీ’ అవార్డులను అందుకున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన 108మందికి రాష్ట్రపతి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా తనకు లభించిన పద్మ అవార్డును ప్రముఖ గాయని ఎస్‌. జానకి తిరస్కరించిన విషయం తెలిసిందే. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమె గైర్హాజరయ్యారు.