ప్రధాన కోచ్ గంభీర్ ఎదుట కఠిన సవాళ్లు
భారత జట్టు భవిష్యత్తు కోసం మార్పులు చేసే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత ప్రధాన కోచ్ గంభీర్ ఎదుట కఠిన సవాళ్లు ఎదురవుతాయని వ్యాఖ్యానించాడు. సీనియర్లు రోహిత్, విరాట్, రవీంద్ర జడేజా, షమీ విషయంలో కఠిన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని.. అంతా సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత మాత్రం గంభీర్పైనే ఉందన్నాడు. ‘‘భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కు ఇది చాలా కీలకమైన టోర్నీ. ఎందుకంటే దీని తర్వాత చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. స్టార్ ప్లేయర్ల వారసత్వాన్ని కొనసాగించాలి. అయితే, ఇది కోచ్గా ఆయన బాధ్యత. అందుకే, ఈ టోర్నమెంట్తో సీనియర్ల భవిష్యత్తు కూడా తేలిపోనుంది. ఏ స్థానాల్లో మార్పులు చేయాలనేది తెలుస్తుంది. గెలిచినా.. ఓడినా మార్పులు మాత్రం ఖాయం. ఇది ముగిసిన తర్వాత వన్డే ప్రపంచకప్ 2027 మెగా టోర్నీకి సన్నాహాలు ప్రారంభించాలి. అలా చేయాలంటే యువకులతో కూడిన స్క్వాడ్ను సిద్ధం చేసుకోవాలి. అందులోని ప్రతిఒక్కరికీ కనీసం 20 మ్యాచుల్లో ఆడే అవకాశం కల్పించాలి. అప్పుడే పరిస్థితులకు ఆటగాళ్లు అలవాటు పడేందుకు ఆస్కారముంటుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత సీనియర్లను కొనసాగించాలా? యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలా అనేది కోచ్, మేనేజ్మెంట్ నిర్ణయించాలి. ఈ విషయంలో గంభీర్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీ20ల్లో ఇప్పటికైతే సన్నద్ధత బాగుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తోంది. వచ్చే ఏడాది పొట్టి కప్ జరగనుంది. వన్డే ప్రపంచకప్నకు రెండేళ్ల సమయం ఉంది. ఆలోగా యువ క్రికెటర్లను సిద్ధం చేయొచ్చు. నిలకడగా పరుగులు చేసే క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వాలి’’ అని కుంబ్లే వెల్లడించాడు. రోహిత్, విరాట్ ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే ఫార్మాట్కూ గుడ్బై చెబుతారని క్రికెట్ వర్గాల అంచనా.