ప్రపంచ ఉద్యమాల చరిత్రలో..

` సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది
` ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది
` దాని స్ఫూర్తి ఆధారంగానే తెలంగాణ పోరాటం
` సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది
` బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా పాలన
` విద్యారంగంలో సమూల మార్పులు తీసుకుని వస్తున్నాం
` విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యానికి పెద్దపీట వేస్తున్నాం
` సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్న రైతు సంక్షేమ పథకాలు
` డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మహిళా మార్టులు
` పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహణ..ఫలితాల వెల్లడి
` సివిల్స్‌ పరీక్షలు రాసేవారికి ఆర్థిక సాయం అందిస్తున్నాం
` కృష్ణా, గోదావరి నదీజలాలపై రాజీ పడేది లేదు
` తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో సిఎం రేవంత్‌ రెడ్డి
` అమరుల స్థూపం వద్ద ఘనంగా నివాళి
హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జనంసాక్షి): ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మనది. సాయుధ పోరాటస్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కనపెట్టాం అని అన్నారు. పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదు. స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో రోల్‌మోడల్‌గా ఉన్నాం. ఉన్నత చదువుల ద్వారా మన యువత సత్తా చాటాలి. భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయి. విద్యతో పాటు- క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. త్వరలో రాష్ట్ర విద్యా విధానం తెస్తున్నాం అని అన్నారు. సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి సత్తాచాటారు. డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మహిళా మార్టులు ఏర్పాటు చేస్తాం. రైతుల కోసం తెచ్చే పథకాలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయని అన్నారు. ఏ రాష్ట్రం చేయని విధంగా వారికి మేలు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడలేదు. సాగు మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి వేగంగా ఫలితాలు వెల్లడిరచాం. సివిల్స్‌ పరీక్షలు రాసేవారికి ఆర్థిక సాయం అందిస్తున్నాం. గత ప్రభుత్వం తెచ్చిన ’ధరణి’ వల్ల రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. మా ప్రభుత్వం వచ్చాక భూభారతి చట్టం తెచ్చి సమర్థంగా అమలు చేస్తున్నాం. పేదల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాం. పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. కృష్ణా, గోదావరి నదీజలాలపై రాజీ పడేది లేదు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాం. 904 టీఎంసీల సాధనకుట్రైబ్యునల్‌ ఎదుట బలమైన వాదనలు వినిపిస్తాం. కృష్ణా జలాల హక్కుల కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పూర్తి చేసి ప్లోరైడ్‌ సమస్య పరిష్కరిస్తాం. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా వెనకడుగు వేసేది లేదన్నారు. హైదరాబాద్‌ అంటేనే ఒక బ్రాండ్‌. ఈ నగరాన్ని గేట్‌వే ఆఫ్‌ వరల్డ్‌గా తీర్చిదిద్దుతాం. 2047 నాటికి మన రాష్ట్రం 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానవిూగా ఎదగాలి. హైదరాబాద్‌కు గోదావరి జలాలు తీసుకొస్తున్నాం. కాలుష్యం లేని నగరంగా మారుస్తున్నాం. మూసీ నది పక్కన జీవించే పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పిస్తాం. ఈ పరిధిలో ఉన్నవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తాం. ఈ ఏడాది డిసెంబర్‌ 9 లోగా అనేక అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం అని అన్నారు. త్వరలోనే మెట్రో విస్తరణ పనులు ప్రారంభిస్తాం. తెలంగాణ అంటేనే పోరాటాలు, త్యాగాలకు వేదిక. యువత పాలిట శాపంగా మారిన డ్రగ్స్‌ సమస్యను అరికడతాం. మాదకద్రవ్యాలు, గంజాయి నిర్మూలనకు ప్రజలు సహకరించాలి. వీటిని అరికట్టడంలో మన పోలీసులు సత్తా చాటారు. తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ సిద్ధం చేస్తున్నాం. డిసెంబర్‌ 9న రాష్ట్ర ప్రజలకు దీన్ని అందిస్తాం. దేశానికి గొప్ప నగరం నిర్మించాలనే ఉద్దేశంతో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ తెస్తున్నాం. దీంతో రాష్ట్ర ఆదాయం బాగా పెరుగుతుంది. రీజినల్‌ రింగ్‌ రోడ్డు కూడా అభివృద్ధి సూచిక కానుంది. 12 రేడియల్‌ రోడ్లు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రపంచఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది 1948, సెప్టెంబర్‌ 17… ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి, స్వేచ్ఛాపతాకను ఎగుర వేసిన రోజు.. ఈ గడ్డపై రాచరికానికి గోరీ కట్టి… ప్రజా పాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్‌ 17.. అందుకే ఇది ప్రజా పాలన దినోత్సవం.. రాష్ట్ర ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వేచ్ఛ మన జీవన విధానం.. ఆ స్వేచ్ఛా సాధనకు ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడని జాతి మనది.. అణచివేత, పెత్తందారీతనం, నియంతృత్వం, బానిసత్వం సంకెళ్లను బద్ధలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి ఊపిరి వదిలిన వందలాది మంది అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.. సెప్టెంబర్‌ 17, 1948 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి.. అదే విధంగా డిసెంబర్‌ 7, 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరోమైలు రాయి.. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మొదలైన స్వరాష్ట్ర ప్రస్థానం తిరిగి మళ్లీ నియంతృత్వ నిర్భందంలోకి జారి పోయిన తీరు గడచిన పదేళ్లలో మనం చూశాం.. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంతృత్వ పాలనను ఓడిరచి, ప్రజా పాలనను తెచ్చుకున్నాం అని అన్నారు. 77 ఏళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని, పోరాట చరిత్రను, ఇక్కడ ఉద్భవించిన ఉద్యమాల సరళిని సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని మేం ఈ రోజు పరిపాలన చేస్తున్నాం.. అహంకారపు ఆలోచనలు, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావు లేదు.. కష్టమైనా, నష్టమైనా ప్రజలతో పంచుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షలు, వారి ఆలోచననే ప్రమాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం.. తీసుకున్న నిర్ణయాలలో మంచి చెడులను విశ్లేషించే అవకాశం ఇస్తున్నాం.. తప్పులుంటే దిద్దుకుంటు-న్నాం. మంచి చేయడమే బాధ్యతగా భావిస్తున్నాం అని సిఎం రేవంత్‌ వివరించారు. అలాగే అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ- పడాలన్న తపనతో పని చేస్తున్నాం.. ప్రతి పేదవాడి మొఖంలో ఆనందమే లక్ష్యంగా సంక్షేమ చరిత్రను తిరగ రాస్తున్నాం.. ఏడు దశాబ్ధాలుగా తెలంగాణ ఆశిస్తోన్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వమే మా ప్రభుత్వ ప్రథామిక ఎజెండా.. అభివృద్ధిలోనే కాదు… స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం విషయంలో కూడా తెలంగాణ దేశానికి రోల్‌ మోడల్‌ గా ఉంటు-ంది.. విద్యనే మన విజయానికి వజ్రాయుధం అని మేం నమ్ముతున్నాం.. గొప్ప విజన్‌ తో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూళ్ల ఆలోచన చేశాం.. భవిష్యత్‌ లో తెలంగాణ విద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఈ స్కూళ్లు కేంద్రాలుగా మారబోతున్నాయి.. విద్యపై మేం చేస్తున్న వ్యయం ఖర్చు కాదు.. భవిష్యత్‌ తెలంగాణకు పెట్టుబడిగా మేం భావిస్తున్నామని అన్నారు. విద్యతో పాటు- క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇన్నోవేషన్‌ కు పెద్దపీట వేస్తున్నాం.. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ-, తెలంగాణ రైజింగ్‌ 2047 రాష్టాన్న్రి సగర్వంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అంతకుముందు అమరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు.పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

 

తెలంగాణ విద్యావిధానం దేశానికి దిక్సూచి కావాలి
` భారీగా నిధులు కేటాయిస్తున్నా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది
` సిలబస్‌, వనరుల సమీకరణ, విధానం అమలుపై స్పష్టత అవసరం..
` భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడలు మేళవింపుతో ఉండాలి
` విజన్‌ డాక్యుమెంట్‌ 2047లో విద్యా విధానానికి ప్రత్యేక అధ్యాయం
` విద్యా రంగం సమూల ప్రక్షాళనే మా ధ్యేయం
` అధికారులు, విద్యావేత్తలతో సమావేశంలో : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): క్షేత్ర స్థాయి పరిస్థితులు, అధ్యయనం, భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు రూపొందించే తెలంగాణ విద్యా విధానం భారతదేశ విద్యా విధానానికి దిక్సూచిలా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో భాష ఉన్న వారి దగ్గర జ్ఞానం లేదని… జ్ఞానం ఉన్న చోట భాష లేదని.. రెండు ఉన్న చోట నైపుణ్యాలు లేవని.. కానీ ఈ మూడిరటి కలబోతగా విద్య ఉండాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ విద్యా విధానం నివేదిక రూపకల్పనపై తెలంగాణ సెక్రటేరియట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో విద్యా రంగాన్ని సమూల ప్రక్షాళన చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు సీఎం తెలిపారు. గతంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు భూముల పంపకం… నిధుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టేవని… ఇప్పుడు పంపకానికి భూములు, తగినన్ని నిధులు లేవన్నారు. ఇప్పుడు పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. విద్యా రంగం ప్రాధాన్యతను గుర్తించినందునే ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ దేశంలో విశ్వ విద్యాలయాలు, ఐఐటీలు వంటి ఉన్నత విద్యా సంస్థలను స్థాపించారని గుర్తు చేశారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉన్న కాలంలో ఉద్యోగావకాశాలకు అనేక పరిమితులు ఉన్నాయని సీఎం అన్నారు. సరళీకృత ఆర్థిక వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగినప్పటికీ విద్యాప్రమాణాలు ఆస్థాయిలో పెరగకపోవడంతో వాటిని అందిపుచ్చుకోవడంలో మనం విఫలమవుతున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కాలానుగుణంగా ఇంజినీరింగ్‌ కళాశాలలు వచ్చినందునే పెద్ద సంఖ్యలో సాఫ్ట్‌ వేర్‌ రంగంలో మన యువత రాణిస్తున్నారని సీఎం తెలిపారు. అయినప్పటికీ మన రాష్ట్రం నుంచి ఏటా బయటకు వస్తున్న లక్షలాది మంది ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో పది శాతం మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదన్నారు. తగినంత నైపుణ్యం లేకపోవడమే అందుకు కారణమన్నారు. ఆ రంగంలో నైపుణ్యాలు పెంచడంతో పాటు ఇంకా పలు రంగాల్లో అవకాశాలు విస్తృతమైనందున ఆ అవకాశాలు అందిపుచ్చుకునేలా విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. విద్యా రంగానికి భారీఎత్తున నిధులు కేటాయిస్తున్నా ఏటికేడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రైవేటు పాఠశాలలు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీతో ప్రారంభిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ప్రారంభమవుతున్నాయన్నారు. నర్సరీకి ప్రైవేటు పాఠశాలలో చేరిన వారు తిరిగి ప్రభుత్వ పాఠశాలల వైపు చూడడం లేదన్నారు. విద్యార్థుల రాకపోకలు, తగిన శ్రద్ధ చూపుతారనే కారణంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ఆ రకమైన ధీమా కల్పించగల్గితే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చుతారని.. తెలంగాణ విద్యా విధానం రూపకల్పనలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సీఎం సూచించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతో తాము అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని సీఎం రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టేలా వారికి ప్రమోషన్లు, బదిలీలు చేశామన్నారు. యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల నియామకం చేపట్టామని సీఎం తెలిపారు. ఉస్మానియా, కాకతీయ విశ్వ విద్యాలయాలు గతంలో సైద్దాంతిక భావజాలలకు నిలయంగా నిలిచి ప్రజా సమస్యలపై ఆందోళనలు, ఉద్యమాలు చేపట్టేవని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వ విద్యాలయాల స్థాయి వరకు విద్యా ప్రమాణాలు పడిపోవడం.. నైపుణ్యాల లేమితో ఉద్యోగాలు లభించకపోవడంతో విద్యార్థులు డ్రగ్స్‌ బారినపడి జీవితాలను కోల్పోతున్నారని సీఎం అన్నారు. మన చదువులు భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో ఉండాలని సీఎం అన్నారు. దేశంలో ఐటీఐలు ప్రారంభించినప్పుడు ఉన్న డీజిల్‌ ఇంజిన్‌ మెకానిక్‌, ఫిట్టర్‌ వంటి సంప్రదాయ కోర్సులే నేటికీ ఐటీఐల్లో ఉన్నాయని సీఎం తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్సులను అందించేందుకు ఐటీఐల్లో కోర్సులను మార్చామని, యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు విద్యా రంగంపై తాము చేసిన కృషితోనే తాము సంతృప్తి చెందడం లేదని.. ప్రాథమిక దశ నుంచి యూనివర్సిటీల వరకు సమూల ప్రక్షాళన చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. రానున్న 25 ఏళ్ల వరకు విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని సీఎం అన్నారు. డిసెంబరు 9వ తేదీన ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌-2047లో తెలంగాణ విద్యా విధానానికి చోటు కల్పిస్తామని సీఎం వెల్లడిరచారు. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక, నైపుణ్య విద్యలుగా విభజించుకొని ఇందులో ఉన్న విద్యావేత్తలు తమ అభిరుచులకు అనుగుణంగా సబ్‌ కమిటీలుగా ఏర్పడి అత్యుత్తమ డాక్యుమెంట్‌ రూపొందించాలని సీఎం కోరారు. విద్యా వ్యవస్థ వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కాకుండా నిరుపేదలకు లబ్ధికలిగేలా ఉండాలని తాము ఆకాంక్షిస్తున్నామని సీఎం తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల పేరిట విద్యార్థులను చిన్నతనం నుంచే వేరు చేస్తున్నామని… దానిని రూపుమాపి అంతా ఒకటే అనే భావన కలిగించేలా విద్యాలయాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండాలని సీఎం అన్నారు. మీరు రూపొందించే తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచిలా ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆశించిన స్థాయిలో తెలంగాణ విద్యా విధానం అమలయ్యేందుకు వివిధ ఫౌండేషన్లు, ఎన్జీవోల సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమగ్రంగా వినియోగించుకునేలా విద్యా విధానం ఉండాలన్నారు. విద్యా విధానంపై ఎంత వ్యయానికైనా తాము వెనుకాడమని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రత్యేక విద్యా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి మౌలిక వసతులు, ప్రమాణాల మెరుగుకు ఖర్చు చేయాలని నిర్ణయించామని తెలిపారు. విద్యపై చేసే వ్యయాన్ని వ్యయంగా కాక పెట్టుబడిగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామన్నారు. విద్యాభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరామని సీఎం తెలిపారు. తెలంగాణ విద్యా విధానంలో సిలబస్‌ రూపకల్పన, వనరుల సమీకరణ, విధానం అమలుపై స్పష్టత అవసరమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ విద్యా విధానం ఛైర్మన్‌ కేశవరావు మాట్లాడుతూ విద్యా కమిషన్‌, ఇతర భాగస్వాములతో తాము విస్తృత సంప్రదింపులు చేశామన్నారు. గణాంకాల కన్నా నాణ్యత ప్రధానమని, విద్యార్థి కేంద్రంగా బోధన ఉండాలనేది తమ అభిప్రాయమన్నారు…ఏఐ వంటివి ఎన్ని వచ్చినా అవి గురువుకు ప్రత్యామ్నాయం కావన్నారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఐ.వి.సుబ్బారావు దేశ యువతలో మూడో వంతు %చీజుజు% గాఉన్నారని…దాని అర్ధం నాట్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌, ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ అని ఓ సర్వే తేల్చిందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల పెంపునకు చేసిన కృషి అభినందనీయమన్నారు. లిముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారు తన సేవలను విద్యా రంగానికి వినియోగించుకోవాలని… విద్యా వలంటీర్‌ గా వినియోగించుకోవాలనిలి కోరారు. ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.ఎస్‌.మూర్తి తాము స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామని… ఒక్క ఏడాదిలో 180 పేటెంట్లు పొందామని సీఎం తెలిపారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ విద్యా విధానం కొలువుల సాధనకే కాకుండా అత్యుత్తమ మానవునిగా తీర్చిదిద్దేదిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఎమ్మెల్సీలు ఏ.వి.ఎన్‌.రెడ్డి, శ్రీపాల్‌ రెడ్డి, విద్యావేత్తలు మోహన్‌ గురుస్వామి, ప్రొఫెసర్‌ సుబ్బారావు, సీఐఐ శేఖర్‌ రెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి, అక్షరవనం మాధవరెడ్డి, విద్యా కమిషన్‌ ఛైర్మన్‌ ఆకునూరి మురళి, ఫ్రొపెసర్‌ గంగాధర్‌, విశ్రాంత ఐఏఎస్‌లు మిని మాథ్యూ శ్రీమతి రంజీవ్‌ ఆచార్య, ప్రొఫెసర్‌ శాంతా సిన్హా తదితరులు మాట్లాడారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీ వి.శేషాద్రి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌ రెడ్డి, అధికారులు జయేశ్‌ రంజన్‌, శ్రీదేవసేన, కృష్ణ ఆదిత్య, నవీన్‌ నికోలస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

హాలీవుడ్‌ స్థాయికి.. హైదరాబాద్‌
` సినీ కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు చెప్పా: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌ను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ సభ్యులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ…‘‘ ప్రభుత్వం నుంచి కార్మికులకు ఏం కావాలో చర్చించుకుని చెప్పాలి. సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు చెప్పా. స్కిల్‌ యూనివర్సిటీలో సినిమా కార్మికులకు శిక్షణ ఇస్తాం. అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్‌ జరిగేలా సహకరించాలి. చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలి. సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం జరుగుతుంది. సమస్యను సమస్యగానే చూస్తా.. వ్యక్తిగత పరిచయాలను చూసుకోను. సినిమా కార్మికుల తరఫున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఈ ప్రభుత్వం మీది.. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది. నేను కార్మికుల వైపు ఉంటా.. రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యం. సినిమా కార్మికులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందజేసే ప్రయత్నం చేస్తాం. సినీ కళాకారులకు గద్దర్‌ అవార్డులు ఇచ్చాం. గత పదేళ్లు సినిమా వాళ్లకు అవార్డులు కూడా ఇవ్వలేదు’’ అని సీఎం అన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు, అనిల్‌కుమార్‌ వల్లభనేని తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.