ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలుకు చర్యలు : జెసి

నల్గొండ, నవంబర్‌ 21 (జనంసాక్షి): ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు పరచడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. బుధవారం నాడు తన ఛాంబర్‌లో ఇండియన్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన సీనియర్‌ అధికారుల బృందం జాయింట్‌ కలెక్టర్‌తో సమావేశమై జిల్లాలో అమలువుతన్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో మీ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవంతం అయ్యాయని సభ్యులకు వివరించారు. జిల్లాలో వాల్టా చట్టం కఠినంగా అమలు పరుస్తున్నట్టు ప్రతి ఆరు నెలలకు ఒకసారి జిల్లాలో వేసే బోర్లకు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఫ్లోరోసిస్‌ 37 గ్రామాలలో తీవ్రంగా ఉందని శాసన సభ స్పీకర్‌ పర్యటన అనంతరం ఫ్లోరోసిస్‌ నివారణకు పటిష్టమైన యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ వివరించారు. డయల్‌ యువర్‌ జెసి కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నట్టు ఆయన వివరించారు. జిల్లా భౌగోళికంగా విభిన్న వాతావరణ పరిస్థితులు కలవని, ఒకవైపు సారవంతమైన భూమితో పాటు మరో వైపు పొడి వాతావరణం కలదని ఆయన తెలిపారు. వైద్య ఆరోగ్య పరిస్థితి, ఈ గవర్నర్సు, ప్రజావాణి, రైతు ఆత్మహత్యలపై బృంద సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ప్రస్తుతం లబ్ధిదారులను రేషన్‌ కార్డు ద్వారానే ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేస్తున్నారు. కాబట్టి రేషన్‌ కార్డులో ఎటువంటి పొరపాట్లు తప్పులు లేకుండా చూడాలని కమిటీ సభ్యులు అధికారులకు సూచించారు. కమిటీ సభ్యులు జాయింట్‌ కలెక్టర్‌కు మెమోంటోను బహుకరించారు. ఈ సమావేశంలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన  సభ్యులు ప్రొఫెసర్‌ సుజాతాసింగ్‌, హరికృష్ణ అరోరా, సంజయ్‌కుమార్‌ బానోత్‌, జాకబ్‌, అశోక్‌కుమార్‌ గుప్తా, నారాయణ్‌, రవిప్రసాద్‌, నరేంద్రసింగ్‌, అదనపు నీలకంఠం, డిఆర్‌వో హన్మంతరెడ్డి, అధికారులు వెంకటేశ్వర్లు, అమోస్‌, మురళి, శ్యాం, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.