ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌: విద్యార్థుల సమస్యలపై చేతకాని తనంగా వ్యవహరిస్తున్న  ప్రభుత్వాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల ఒకరోజు బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మంగళవారం మూసివేయాలని సంఘం నాయకులు తెలిపారు. పాఠ్య పుస్తకాల పంపిణీలో జాప్యం, మధ్యాహ్న భోజన పథకంలో నాసిరకం వస్తువుల వాడకం, ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం చేతకాని తనం వంటి పలు సమస్యలపై బంద్‌ చేస్తున్నట్లు ఎస్‌ఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్‌ తెలియజేశారు. ఈ నెల 11,12 తేదీల్లో పాఠశాలల వద్ద ఆందోళన చేసిన ఎస్‌ఫ్‌ఐ, పీడీఎన్‌యూ, ఏఐఎన్‌ఎఫ్‌,ఏఐడీఎన్‌వో విద్యార్థి సంఘాలు తమ చివరి ప్రయత్నంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం మాత్రం విద్యార్థి సంఘాల బంద్‌కు పిలుపును వ్యతిరేకిస్తుంది.ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు కాకముందే ఇప్పటికే మూడు రోజులు సెలవుగా విద్యార్థి సంఘాలు ప్రకటిస్తాయని బంద్‌ల పేరుతో పిల్లల భవిష్యత్తును పాడు చేయవద్దని కోరుతున్నాయి. గుర్తింపు పొందిన పాఠశాలలేవి బంద్‌ పాటించవద్దని పిలుపునిచ్చాయి.