రాజోలి ఎస్ఐపై వేటు

ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో రైతులపై అత్యుత్సాహం

బాధ్యతల నుంచి తప్పిస్తూ పోలీస్ అధికారుల చర్యలు

రాజోలి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఎలాంటి విచారణ జరపకుండా దాడి ఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించిన రాజోలి ఎస్సై జగదీష్ పై వేటు పడింది. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఆయన్ని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద ధన్వాడలోని ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ముందు నుంచి రాజోలి ఎస్సై రైతులపై అత్యుత్సాహం ప్రదర్శించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 4న జరిగిన ఘటనకు ఎస్సై ప్రవర్తనే ముఖ్య కారణంగా తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు ఉదయం గ్రామంలోకి వెళ్లి రైతులను రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఎస్సై ముందు నుంచి అత్యుత్సాహం ప్రదర్శించినట్లు రైతులు అంటున్నారు. ఘటన తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా.. రైతు నాయకులను బెదిరించడం ఊరిలోకి వెళ్లి భయభ్రాంతులకు గురిచేయడం.. వంటి చర్యలకు ఎస్సై పూనుకున్నాడు. ఈ నేపథ్యంలో జూన్ 4న జరిగిన ఘటనకు సంబంధించిన విషయంలో ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదును ఎలాంటి విచారణ జరపకుండా రైతులపై కేసులు నమోదు చేశారు. దీంతో కేసులో 12 మంది రిమాండ్ అయ్యారు. మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రాజోలి ఇథనాల్ ఫ్యాక్టరీ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు అన్నివిధాల కారణమైన రాజోలి ఎస్సైపై చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్ణయించిన నేపథ్యంలో ఆయన్ని ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోలీస్ అధికారుల నిర్ణయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమాయక రైతులపై అకారణంగా నమోదు చేసిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజావార్తలు