హసీనాను అప్పగించాలని అడిగితే మోదీ ఏం చెప్పారంటే..: మహమ్మద్ యూనస్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించే విషయంలో మోదీ సుముఖంగా లేరని ఆయన ఆరోపించారు. లండన్లోని ప్రఖ్యాత చాఠమ్ హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ యూనస్ ఈ విషయాలను వెల్లడించారు.గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థులు చేపట్టిన భారీ ఆందోళనల కారణంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నాటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి భారత్లో ఆశ్రయం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్కు రప్పించి, ఆమెపై ఉన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలో, బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో తాను షేక్ హసీనా అంశంపై చర్చించినట్లు యూనస్ తెలిపారు. “షేక్ హసీనా ఆన్లైన్లో రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు. దీనివల్ల బంగ్లాదేశ్లో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఆమె ప్రకటనలు, ప్రసంగాలను అడ్డుకోవాలని నేను ప్రధాని మోదీని కోరాను” అని యూనస్ వివరించారు. అయితే, అందుకు మోదీ స్పందిస్తూ, “అది సోషల్ మీడియా, దాన్ని నియంత్రించడం సాధ్యం కాదు” అని చెప్పినట్లు యూనస్ వెల్లడించారు.షేక్ హసీనాపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, ఆమె చేసిన నేరాలకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేశామని యూనస్ తెలిపారు. “ఆమెకు సంబంధించిన నేరాల చిట్టా ఇంకా బయటపడుతూనే ఉంది. చట్టబద్ధంగానే ఆమెను బంగ్లాదేశ్కు తీసుకురావాలని మేం ప్రయత్నిస్తున్నాం. ఈ విషయమై ఇప్పటికే భారత్కు అధికారికంగా లేఖ రాశాం” అని ఆయన వివరించారు.