ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలి..

` ఏడుగురి దుర్మరణం
గౌరీకుండ్‌(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌లోని గౌరీకుండ్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన 6 మంది యాత్రికులతో హెలికాప్టర్‌ గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరింది. అందులో సాంకేతిక సమస్యలు తలెత్తడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బయల్దేరిన 10 నిమిషాల్లోనే కుప్పకూలింది. సమాచారం అందుకున్న అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (%చీణRఖీ%), ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మే 2న కేదార్‌నాథ్‌ ద్వారాలు తెరుచుకున్నప్పటి నుంచి ఇది ఐదో ప్రమాదం. జూన్‌ 7న ఉత్తర్‌ప్రదేశ్‌లోని రుద్రప్రయాగ్‌ జిల్లాలో కేదార్‌నాథ్‌కు వెళ్తున్న ఓ హెలికాప్టర్‌ బాదాసుబేస్‌ నుంచి టేకాఫ్‌ అయిన వెంటనే అందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఉత్తరాఖండ్‌లోని ఓ హైవేపై అత్యవసర ల్యాండిరగ్‌ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్‌ టెయిల్‌ రోటర్‌ పడి సమీపంలోని కొన్ని భవంతులు, రోడ్డుపై నిలిపి ఉంచిన ఓ కారు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయి.