అవార్డుల వేడుకలకు తప్పనిసరిగా హాజరుకావాలి

` ప్రభుత్వంతో ప్రయాణించాల్సిన బాధ్యత సినిమా వారందరిపై ఉంది
` చిత్ర పరిశ్రమకు దిల్‌రాజు సూచన
హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రభుత్వాలు నిర్వహించే సినిమా వేడుకకు తప్పనిసరిగా హాజరుకావాలని చిత్ర పరిశ్రమకు ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు సూచించారు. ‘తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ ప్రదానోత్సవం శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేందుకు దిల్‌ రాజు తాజాగా ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ‘’తెలంగాణ గద్దర్‌ అవార్డుల వేడుక నిన్న గ్రాండ్‌గా జరిగింది. ఆ విషయంలో ఆనందంగా ఉంది. దాని కోసం ఆరు నెలలుగా వర్క్‌ చేశాం. ఈ పురస్కారాలకు సంబంధించి కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. ముందుగా 2024 చిత్రాలకే అవార్డులు ఇవ్వాలన్నది ప్లాన్‌. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఏడాది నుంచీ ఇస్తే బాగుంటుందని పలువురు సూచించారు. ఆ మేరకు ఓ కమిటీ ఏర్పాటైంది. 2014 నుంచి 2023 వరకూ ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం కష్టమైన పని. వేడుకలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం ఒక గంట కేటాయించారు. కానీ, ప్రోగ్రామ్‌ ప్లానింగ్‌ నాలుగున్నర గంటలుగా ఉంది. అందుకే రేవంత్‌ వేడుకకు వచ్చాక.. పరిస్థితి వివరించి, ఇంకా ఎక్కువ సమయం ఉండాలని వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశా. ‘ఎంతసేపు ఉండాలి?’ అని అడిగారు. పూర్తయ్యే వరకూ ఉంటే చాలా హ్యాపీ సర్‌ అని చెప్పా. అలా 2:15 గంటల పాటు అక్కడ ఉన్నారు. సీఎం చేతుల మీదుగా అవార్డులను అందుకున్న వారంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ పురస్కారాల వేడుక విషయంలో మాకు మార్గనిర్దేశం చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు’’ ‘’త్వరలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అవార్డులు ఇస్తుంది. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే.. చాలా జాగ్రత్తగా వాటిని స్వీకరించాలి. ఎక్కడున్నా, షూటింగ్‌తో బిజీగా ఉన్నా రావాలి. ప్రభుత్వంతో ప్రయాణించాల్సిన బాధ్యత సినిమా వారందరిదీ. ఇకపై ప్రభుత్వం తరఫున అవార్డుల వేడుక ప్రకటన వచ్చినప్పుడు.. మీ డైరీల్లో నోట్‌ చేసుకుని, మీకు వచ్చిన అవార్డు తప్పకుండా స్వీకరించండి. చిత్ర పరిశ్రమకు ఇది నా విజ్ఞప్తి. అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. వేడుకకు హాజరై, విజయవంతం చేసిన వారందరికీ ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌ ధన్యవాదాలు తెలిపారు.