గుజరాత్‌ విమాన ప్రమాదం..

డీఎన్‌ఏతో మృతుల గుర్తింపు
` అందులో విజయ్‌ రూపాణీ మృతదేహం
అహ్మదాబాద్‌(జనంసాక్షి):అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ నమూనాతో పోల్చి చూసే ప్రక్రియ మూడు రోజులుగా కొనసాగుతోంది.ఇప్పటివరకు 47 మందిని గుర్తించగా.. 24 మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడిరచారు. వీరిలో గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. విమానంలో మొత్తం 242 మందికిగాను 241 మంది చనిపోయారు. వీరితోపాటు 29 మంది వైద్య విద్యార్థులు, స్థానికులు ప్రాణాలు కోల్పోగా.. అనేక మృతదేహాలు గుర్తుపట్టకుండా కాలిపోయాయి. దీంతో డీఎన్‌ఏ పరీక్షలు అనివార్యమయ్యాయి. ఈ ప్రక్రియ సుదీర్ఘ సమయం పడుతుండటంతో బాధిత కుటుంబాలు వేచిచూస్తున్నారు. విమాన ప్రమాద ఘటనా ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీకే మిశ్రా పరిశీలించారు. అనంతరం చికిత్స తీసుకుంటున్న బాధితులు, వారి కుటుంబీకులను పరామర్శించారు. వారికి అందుతున్న సాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను రాష్ట్ర అధికారులు ఆయనకు వివరించారు.