భారత్‌కు సైప్రస్‌ విలువైన భాగస్వామి

` ఆ దేశ పర్యటనలో ప్రధాని మోదీ
` ఘనంగా స్వాగతం పలికిన అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడోలైడ్స్‌
నికోసియా(జనంసాక్షి):మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు ద్వీప దేశమైన సైప్రస్‌కు చేరుకున్నారు. దేశాధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడోలైడ్స్‌ ఆయనకు స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. 23 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని సైప్రస్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇందులో భాగంగా క్రిస్టోడౌలైడ్స్‌తో మోదీ సమావేశం కానున్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, పునరుత్పాదక ఇంధనం, కౌంటర్‌ టెర్రరిజం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా చర్చలు జరపనున్నారు.మూడు దేశాల పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని మోదీ ఓ ట్వీట్‌ చేస్తూ.. మధ్యధరా, ఈయూ ప్రాంతంలో సైప్రస్‌ను విలువైన భాగస్వామిగా పేర్కొన్నారు. ఈ పర్యటన ఇరుదేశాల మధ్య వాణిజ్యం, సాంస్కృతికం వంటి కీలక రంగాల్లో సంబంధాలను మరింత పెంపొదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌- ఇరాన్‌ పరస్పర దాడుల కారణంగా పశ్చిమాసియాలో గగనతల ఆంక్షల నేపథ్యంలో ప్రధాని మోదీ విమానం అరేబియా సముద్రం, ఆఫ్రికా గగనతలం మీదుగా సైప్రస్‌కు చేరుకున్నట్లు సమాచారం.సైప్రస్‌ నుంచి ప్రధాని మోదీ నేరుగా కెనడాకు వెళ్తారు. ఆ దేశ ప్రధాని మార్క్‌ కార్నీ ఆహ్వానం మేరకు జూన్‌ 16-17న కననాస్కిస్‌లో జరగనున్న జీ-7 సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం వరుసగా ఆరోసారి. ఇందులో భాగంగా జీ-7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. జీ-7 దేశాల్లోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలపై చర్చలు జరపనున్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా జూన్‌ 18న మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.