ప్రశాంతంగా ‘నీట్‌’ పరీక్ష

హైదరాబాద్‌, మే 5 (జనంసాక్షి):
నీట్‌ పరీక్షప్రశాంతంగా జరిగింది. ఎంబిబిఎస్‌, బీడీఎస్‌లలో ప్రవేశాలకు సంబంధించి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆదివారంనాడు నిర్వహించిన నేషనల్‌ ఎలిజబులిటి ఎంట్రన్స్‌ టెస్టు (నీట్‌) ముగిసింది. ఇదిలా ఉండగా వైద్య విద్య సీట్లకు పోటీ పడే విద్యార్థులు నీట్‌తో పాటు ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. రెండింటిలో ఏ పరీక్ష ఫలితాలు పరిగణనలోకి తీసుకోవాలనే విషయం సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఉంటుంది. నీట్‌పరీక్ష రాష్ట్రంలోని హైదరాబాద్‌, విశాఖపట్నం, వరంగల్‌, నెల్లూరు, విజయవాడలలో జరిగింది.
సెంటర్ల వారీగా వివరాలిలా..
విజయవాడలో 34 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 20వేల మంది విద్యార్థులు పరీక్ష రాసినట్టు సమాచారం. అలాగే విశాఖపట్నంలో 15 పరీక్షా కేంద్రా ల్లోను, నెల్లూరులో 11 పరీక్షా కేంద్రాల్లోను విద్యార్థులు పరీక్ష రాశారు. వరంగల్‌లో సుమారుగా 5,500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు తెలిసింది. హైదరాబాద్‌ నగరంలో నీట్‌ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.