బండి సంజయ్‌ పాదయాత్రను అడ్డుకుంటాం

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సంజయ్‌ పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. సంజయ్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తుంగబాలు మాట్లాడుతూ నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదని అన్నారు. ఇప్పటికైనా ఆయన తన తీరు మార్చుకోకపోతే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని స్పష్టం చేశారు. వెంటనే బండి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పాదయాత్రతో సహా రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని హెచ్చరించారు. దేశ అత్యున్నత చట్టసభ సభ్యుడిగా ఉన్న సంజయ్‌ ఆ పదవిని అవమానిస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ గౌరవం గురించి తెలుసుకుని ప్రవర్తించాలని హితవు పలికారు. ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. త్వరలోనే బండి సంజయ్‌కు ప్రజల చేతిలో తగిన గుణపాఠం తప్పదని అభిప్రాయపడ్డారు.