బుడ్డరఖాన్‌లో రేవంత్‌ మాటలు

బడ్జెట్‌ నిరాశ  కల్పించిందన్న కెటిఆర్‌
హైదరాబాద్‌,ఫిబ్రవరి10(జనం సాక్షి):   తెలంగాణ సర్కారు  అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌  నిరాశజనకంగా ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సికింద్రాబాద్‌లో శనివారం జరిగిన సనత్‌నగర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ హావిూ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు రూ.1.25 లక్షల కోట్లు అవసరమవుతాయని, కానీ బడ్జెట్‌ లో మాత్రం కేవలం రూ.53 వేల కోట్ల మాత్రమే కేటాయించారని కేటీఆర్‌ విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.ప్రతి కరెంటు విూటర్‌కు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్‌ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణ జల హక్కులను కృష్ణాబోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ 13న నల్లగొండలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామని చెప్పారు.