భారత్ చేరుకున్న ఒబామా
కనీవినీ ఎరుగనిరీతిలో కట్టుదిట్టమైన భద్రత
ఆగ్రా పర్యటన రద్దు
సొంత సైన్యంతో పెద్దన్న పర్యటన
న్యూడిల్లీ,జనవరి24(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ చేరుకున్నారు. ఆదివారం ఉదయం 4.40కి ఒబామా దిల్లీ చేరుకున్నారు. భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఒబామా భద్రత కోసం 7 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దిల్లీ పోలీసులు, అమెరికా సైన్యం సంయుక్తంగా ఒబామా పర్యటనకు కనీవినీ ఎరుగనిరీతిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం అమెరికా నుంచి భారత పర్యటనకు బయలుదేరారు. భద్రతా కారణాల దృష్ట్యా ఒబామా భారత పర్యటన షెడ్యూల్ను కుదించడమే గాకుండా ఆగ్రా పర్యటనను కూడా రద్దు చేశారు. ఒబామా ఆగ్రా పర్యటనను రద్దు చేస్తున్నట్టు ఆయన భద్రతా సిబ్బంది ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఒబామా తన భార్య మిషెల్ ఒబామాతో కలిసి ఈనెల 27న ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల రీత్యా తాజ్మహల్ పర్యటనను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఒబామా భారత్ పర్యటన రెండు రోజులకే పరిమితం కానుంది. శనివారం సాయంత్రం ఎయిర్ఫోర్సు వన్ విమానంలో అమెరికా నుంచి భారత్కు బయలుదేరిన ఒబామా ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10:10 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. 10:40 గంటలకు రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మగాంధీ సమాధికి నివాళులర్పించనున్నారు. 11:20కి హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1:50కి మోదీ, ఒబామాలు సంయుక్తంగా ప్రెస్విూట్ నిర్వహించనున్నారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ఒబామా దంపతులకు విందు ఇస్తారు. జనవరి 26న ఉదయం ఒబామా 9.25 గంటలకు రాష్ట్రపతి భవన్కు వెళ్లనున్నారు. ఉదయం 10గంటలకు గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు. తరువాత సీఈవోల సదస్సులో ఒబామా ప్రసంగం ఉంటుంది. 26న సాయంత్రం 5:45కి మోడీతో కలిసి సీఈవోల రౌండ్టేబుల్ సమావేశానికి హాజరుకానున్నారు. 26న సాయంత్రం 6:50 నుంచి 7:20 వరకు ఒబామా ప్రసంగం ఉంటుంది. 26న రాత్రి ప్రధాని ఇచ్చే విందుకు ఒబామా దంపతులు హాజరుకానున్నారు. 27న సాయంత్రం 4:35కు పాలం ఎయిర్పోర్టుకు ఒబామా చేరుకోనున్నారు. సాయంత్రం ఎయిర్ఫోర్స్ వన్లో ఒబామా బయలుదేరి వెళతారు.