మరికొంత సమయమివ్వండి ప్లీజ్‌

సుప్రీంను అభ్యర్థించిన సంజయ్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి):
జైలు శిక్షను అనుభవించేందుకు కోర్టులో లొంగిపోయేందుకు తనకు మరికొంత గడువు ఇప్పించాల్సిందిగా బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తాను  ఇప్పటికే అంగీకరించిన సినిమాల షూటింగ్‌ పూర్తి చేయాల్సి ఉన్నందున కొంతసమయం ఇప్పించాల్సిందిగా కోరారు. అంతేగాక తన క్షమాభిక్ష పిటిషన్‌పై గవర్నర్‌ నిర్ణయం తీసుకునేవరకు కూడా కొంత సమయం ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. 1993లో ముంబయిలో జరిగిన వరుస బాంబుపేలుళ్ళ నేపథ్యంలో సంజయ్‌దత్‌ అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసు విచారణలో ఉండగానే 18నెలల పాటు ఆయన జైలు శిక్ష         అనుభవించారు. ఆ శిక్షాకాలం పోను మిగిలిన శిక్షా కాలాన్ని అనుభవించేందుకు ఏప్రిల్‌ 18లోగా లొంగిపోవాలని సంజయ్‌దత్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టులో మరికొంత సమయాన్ని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాలు రూ.70నుంచి 100కోట్ల వ్యాపారంతో ముడిపడి ఉన్నదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.