మరోసారి కేసీఆర్‌ మాయమాటలు నమ్మకండి

– కాళేశ్వరం పేరుతో కాంట్రాక్టర్ల జేబులు నింపారు
– టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం
భూపాలపల్లి, నవంబర్‌29(జ‌నంసాక్షి) : నాలుగేళ్లలో చేయని కేసీఆర్‌.. మళ్లీ గెలిపిస్తే  చేస్తానని నమ్మబలుకుతున్నారని, మరోసారి కేసీఆర్‌ మాయమాటలు నమ్మకండి అంటూ టీజేఎస్‌ అధినేత కోదండరాం ప్రజలకు పిలుపునిచ్చారు. భూపాలపల్లిలో ప్రజాకూటమి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ఫాంహౌస్‌కు వెళ్లే కేసీఆర్‌ను మళ్లీ పిలవొద్దని అన్నారు. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలో గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు. చెట్ల పేరుతో గిరిజనుల భూములు లాక్కున్నారని ఆయన ఆరోపించారు. భూరికార్డుల ప్రక్షాళన కారణంగా భూమి పోయిందన్నారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఎన్నో కష్టాలు పడ్దారని, కౌలురైతు.. రైతే కాదన్నట్టుగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బొగ్గు గని కార్మికుల వెతలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఓసీపీ గనుల వల్ల పంటలు, ఊళ్లు దుమ్ముతో నిండిపోయాయని తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు.
ప్రజాకూటమి గెలిస్తే కుటుంబపాలన ఉండదని, ప్రజాకూటమి మ్యానిఫెస్టో అమలుకు కార్యాచరణ రూపొందించామని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం పేరుతో కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌, విద్య, వైద్యం, ఉద్యోగాలను మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజాకూటమి అధికారంలోకి రాగానే ప్రాజెక్టులపై సవిూక్ష చేస్తామని..ముంపు బాధితులను ఆదుకుంటామని కోదండరాం హావిూ ఇచ్చారు.