మహా అవగాహన
ప్రాణహిత చేవెళ్లకు మహారాష్ట్ర సానుకూలత
గోదావరిలో 160 టీఎంసీల నీటివినియోగానికి అభ్యంతరం లేదన్న మారాఠా సర్కార్
ముంపు ప్రాంతాలు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం
లోయర్ పెనుగంగ పూర్తికి ఇరురాష్ట్రాల అంగీకారం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్తో సీఎం కేసీఆర్ కీలకభేటీ
ముంబై, ఫిబ్రవరి17(జనంసాక్షి): తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం సానుకూల నిర్ణయాలతో ముగిసింది. రెండు రాష్ట్రాల మధ్య నిర్మించ తలపెట్టిన అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసుకోవాలని ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. వీటి ద్వారా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. ముంబైలోని రాజ్ భవన్ లో జరిగిన సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దాదాపు గంటన్నరసేపు చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసి గోదావరి జలాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తీర్మానించారు. భూ సేకరణ, నష్ట పరిహారం చెల్లింపు, కోర్టు కేసుల పరిష్కారం, ముంపు ప్రాంత ప్రజల అభ్యంతరాలు తదితర అంశాలను చర్చించి ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడానికి రెండు రాష్ట్రాలు నిపుణుల కమిటీని నియమించుకోవాలని నిర్ణయించారు.
దిండి ప్రాజెక్టుపై 2003 లోనే కుదిరిన అవగాహన మేరకు ఆరు టిఎంసిలకు పైగా గోదావరి జలాలను రెండు రాష్ట్రాల రైతులకు మళ్లించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ ప్రాజెక్టు కింద మహారాష్ట్రలో 12 గ్రామాలు మునుగుతుండగా, వాటిలో 11 గ్రామాల్లో భూసేకరణ పూర్తయ్యిందని, 6 గ్రామాల్లో నష్ట పరిహారం కూడా చెల్లించామని అధికారులు చెప్పారు. మిగతా గ్రామాల్లో కూడా భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం డబ్బులు చెల్లించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే రూ. 500 కోట్లు వెచ్చించామన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన మహారాష్ట్ర సీఎం.. తమవైపు నుంచి అన్ని పనులు పూర్తిచేస్తామన్నారు.
రెండు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగపడే లోయర్ పెన్ గంగ ప్రాజెక్టును కూడా త్వరగా పూర్తి చేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు వల్ల మునిగిపోయే అటవీ భూమికి నష్టపరిహారంగా మరోచోట భూమి కేటాయించాలని నిర్ణయించారు. రాజాపేట, రుభా, పిపర్డ్ల వద్ద బ్యారేజ్ లు కట్టడానికి అంగీకారానికి వచ్చారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడానికి సిద్ధంగా ఉన్నందున మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ కోరారు. దీనికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. గోదావరి నదిలో 160 టిఎంసిల నీటిని తెలంగాణ వాడుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. అయితే, గడ్చిరౌలి, చంద్రాపూర్ జిల్లాల్లోని దాదాపు 30 గ్రామాల్లో 740 హెక్టార్ల భూమి మునిగిపోతుందని ఆయన చెప్పారు. దీనికి స్పందించిన తెలంగాణ సిఎం కేసీఆర్.. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు డిజైన్ సరిగా లేదన్నారు. ముంపు ముప్పు ఎక్కువగా లేకుండానే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు.
ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తాయని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ చెప్పారు. మూడు ప్రాజెక్టుల విషయంలో ఎప్పటికిప్పుడు చర్చలు జరుపుతామని, పరస్పరం సంప్రదించుకుంటూ ముందుకు పోతామన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఆకాంక్షలు , అవసరాలు ఉన్నాయని, వాటికి అనుగుణంగా ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఘర్షణపూరిత వాతావరణం కొనసాగించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ముంపును తగ్గించుకుంటూ, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకుంటూ తెలివిగా వ్యవహరించాల్సి ఉందన్నారు. అంతరాష్ట్ర ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే విషయంలో సానుకూలంగా స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ను అభినందించారు. పుట్టినరోజు నాడు సంబరాలు చేసుకోకుండా తెలంగాణ ప్రజలకోసం కేసీఆర్ ముంబై దాకా వచ్చారని ప్రశంసించారు.
మహా శివరాత్రి పండగనాడు కూడా రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం కోసం సమయం కేటాయించినందుకు ఫడ్నవీస్ కు సీఎం కేసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్ రావు, జోగు రామన్న, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, వేణుగోపాలాచారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర రావు, ఎంపీలు కె.కేశవరావు, బి. వినోద్ కుమార్, జితేందర్ రెడ్డి, బి.వి.పాటిల్, నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్.కె.జోషి, ఇఎన్సి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.