మాటమార్చిన చైనా టెన్నిస్‌ స్టార్‌

తనపై లైంగిక దాడి జరగలేదని వివరణ
బీజింగ్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): చైనా ఉపాధ్యక్షుడు జాంగ్‌ గవోలీ తనను బలవంతంగా లొంగదీసుకు న్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిన చైనా స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షూయి మాట మార్చింది. తనపై లైంగిక దాడే జరగలేదంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. సింగపూర్‌కు చెందిన ఓ చైనా భాషా పత్రికతో మాట్లాడుతూ.. ఆమె ఈ మేరకు స్పష్టం చేసింది. లైంగిక దాడి అంశంపై తాను చేసిన ఆన్‌లైన్‌ పోస్ట్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారని, తనపై లైంగిక దాడి జరిగిందని తాను ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపింది. ఇదిలా ఉంటే, లైంగిక దాడి విషయమై చైనా ప్రభుత్వం పెంగ్‌పై ఒత్తిడి తెచ్చిందంటూ మహిళల టెన్నిస్‌ సమాఖ్య అనుమానం వ్యక్తం చేస్తుంది. పెంగ్‌.. చైనా ఉపాధ్యక్షుడిపై ఆరోపణలు చేసిన నాటి నుంచి కనిపించకుండా పోవడంతో టెన్నిస్‌ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.