మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు

ఖమ్మం,జనవరి24(జ‌నంసాక్షి): మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రలో పంటను అమ్ముకునే రైతులకు క్వింటా ఒక్కంటికి రూ 5,050 చొప్పున చెల్లించడం జరుగుతుందని, మక్క రైతులు నాణ్యమైన పంటను మాత్రమే తీసుకరావాలని మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ అన్నారు. పంటను తీసుకొచ్చిన వాటిలో చెత్త, మట్టి, రాళ్లు లేకుండా చూసుకోవాలన్నారు.  పంటలో 12శాతంకు మించి తేమ ఉండకూడదన్నారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రంలో పంటను అమ్మదల్చిన వారు సొంత భూమికి సంబంధించిన పాసుపుస్తకం, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ పత్రాలను తమ వెంట తీసుకరావాలన్నారు. రైతులకు మంచి గిట్టు భాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ఏఎంసీలో ప్రత్యేక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మార్కెట్లో ఏర్పాటుచేసిన మక్కల కొనుగోలు కేంద్రం, ప్రైవేట్‌ కేంద్రంలో జరిగే మక్కల కొనుగోళ్ల పక్రియ పారదర్శకంగా జరిగే విధంగా చూడాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆర్జేసీ కృష్ణ అధికారులకు సూచించారు. మార్క్‌ఫెడ్‌, పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతుల పంటలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రంలో కాంటాల పక్రియ త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూడాలని అధికారులకు సూచించారు.