మా బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయండి

కేకే డిమాండ్‌
హైదరాబాద్‌, మే 6 (జనంసాక్షి) :
తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు కె. కేశవరావు, బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ, టీడీపీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్‌ రావుతో కలిసి సోమవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమా ర్‌రెడ్డిని కలిశారు. అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ స్వతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్‌బాపూజీ రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలు భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన చేసిన త్యాగం, ప్రజల శ్రేయస్సు కోసం చూపిన చొరవ ప్రతి ఒక్కరు అనుసరించాలని సూచించారు. బాపూజీని తెలంగాణ వ్యక్తి అని నిర్లక్ష్యం చేస్తే, వివక్ష చూపితే చూస్తూ ఊరుకోబోమన్నారు. వెంటనే బాపూజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలని కోరారు.