మిగులు విద్యుత్కు ప్రణాళికలు
కరెంటు కష్టాలపై సర్కారు ముందుచూపు
కోతలను అధిగమించేందుకు కొనుగోలుకు సిద్ధం
వ్యవసాయానికి ప్రాధాన్యత
సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,ఫిబ్రవరి4(జనంసాక్షి): తెలంగాణలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్కు డిమాండ్కు మధ్య వ్యత్యాసం భారీగా ఉంది. రానున్న వేసివిలో ఇది మరింత ప్రభావం చూపనుంది. దీంతో ఈ పరిస్థితిని గట్టెక్కేందుకు సిఎం కెసిఆర్ అన్ని చర్యలకు ఉపక్రమించారు. తెలంగాణ రాష్ట్రం 2018 చివరి నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారాలని, అందుకోసం అధికారులు కాలపరిమితితో కూడిన ప్రణాళికను సిద్దం చేసుకుని కార్యాచరణలో ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. వచ్చే బడ్జెట్లో జెన్కో 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి సచివాలయంలో బుధవారం సవిూక్ష నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణలో 4,300 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందని, కాని డిమాండ్ మాత్రం 6,000 వరకు ఉందని చెప్పారు. పురోగతిలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా, కేంద్ర వాఆ ద్వారా ఈ ఏడాది చివరి నాటికి మరో 2,000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అప్పటికి కొంత లోటు తీరుతుందని అన్నారు. అయితే కోతలను అధిగమించేందుకు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాలని అధికారులకు సిఎం సూచించారు. ప్రస్తుతం అందుబాటులో వున్న విద్యుత్, వచ్చే ఏడాదికి అందుబాటులోకి వచ్చే విద్యుత్, ప్రతి ఏటా జరగాల్సిన పురోగత, అంతిమంగా సాధిచాల్సిన లక్ష్యాలు, అందుకు అనుసరిస్తున్న మార్గాలు, విద్యుత్ విధానాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. 2018 చివరి నాటికి రాష్ట్రంలో 21,350 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కావాలని, జల విద్యత్తో కలుపుకుని దాదాపు 24,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాలని ఆకాంక్షించారు.ఈ ఏడాది రబీ సీజన్లో కూడా రైతులకు కొంత ఇబ్బంది తప్పక పోవచ్చని అంచనా వేశారు. వీలైనంత వరకు రైతులకు చాలినంత విద్యుత్ ఇచ్చేందుకు ప్రయత్నించాలని, వ్యవసాయ విద్యత్కే మొదటి ప్రాధాన్యత నివ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అవసరమున్నంత మేరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ను కొనుగోలు చేయాలని ఆదేశించారు. 2016 మధ్య వరకు చత్తిస్గడ్ నుండి రావాల్సిన 1000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. దాంతో పాటు సింగరేణి ద్వారా కూడా మరో 1080 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, ఈ రెండు వేల మెగావాట్లతో 2016 నాటికి 8,500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అప్పటి నుండి రైతులకు ఒకే విడత పగటి పూట విద్యుత్ అందిందవచ్చని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. చత్తిస్గడ్ ప్రభుత్వం మరో 1000 మెగావాట్ల విద్యుత్ అందించిడానికి సిద్దంగా ఉన్నందున అక్కడి ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. చత్తిస్గడ్ నుండి విద్యుత్ను పొదటానికి పీజిసిఎల్ చేపట్టిన లైన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేందుకు అధికారులు చొరవ చూపాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్టిపిసి ద్వారా 4,000 జెన్కో ద్వారా 6,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం చేస్తున్న పనులు కూడా మూడేళ్లలో పూర్వవుతాయని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. వీటితో పాటు జల విద్యత్,సోలార్ విద్యుత్ కూడా అదనంగా అందుబాటులోకి వస్తుందని, అప్పుడు తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యత్ రాష్ట్రంగా మారుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అవసమయ్యే 4,000 మెగావాట్ల విద్యుత్ను పూర్తి స్థాయిలో అందించవచ్చని, కొత్త పరిశ్రమలు, లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టులకు, వాటర్గ్రిడ్కు, వాణిజ్య అవసరాలకు, గృహావసరాలకు కావలసినంత విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. సోలార్ విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చే అవకాశముందని, కాబట్టి సోలార్ ప్రాజెక్టుల అగ్రిమెంట్ల విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మణుగూరులో నిర్మించతలపెట్టిన విద్యుత్ ఉత్పత్తి ప్లాంటుకు భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ అనే పేరును ముఖ్యమంత్రి ఖాయం చేశారు. త్వరలోనే అక్కడ శంఖుస్థాపన చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ ప్లాంట్ నిర్మాణ పనుల కోసం బిహెచ్ఇఎల్కు కేటాయించడానికి ప్రభుత్వం రూ.350 కోట్లను విడుదల చేసింది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గును విదేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి అవసరమయ్యే కార్యాచరణ రూపోందంచాలని, రేట్ల నిర్ణయం, రైల్వే లైన్ల నిర్మాణం తదితర పనుల విషయంలో చొరవ చూపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, జెన్కో చైర్మన్ ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్,ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, టిఎస్ సిపిడిఎల్ సిఎండి రఘరామరెడ్డి తదితరులు ఈ సవిూక్షలో పాల్గొన్నారు.