మూడో విడత పోలింగ్కు సర్వం సిద్ధం
` ముగిసిన ఆఖరి విడత ప్రచారం.. రేపు ఓటింగ్..
` ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్
` మధ్యాహ్నం నుంచి ఫలితాల ప్రకటన
హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది.సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియగా, బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 11న తొలి విడత, 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తుది విడత ఎన్నికలు డిసెంబర్ 17న జరగనున్నాయి. దీంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. ఇన్ని రోజులు గ్రామాల్లో హోరెత్తించిన మైకులు మూగబోయ్యాయి. డిసెంబర్ 17న 182 మండలాలు 4157 గ్రామ పంచాయతీలు,28, 406 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. తుది విడతలో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 53 లక్షల 6వేల 401 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకో నున్నారు. ఇందులో 26 లక్షల 1861 పురుష ఓటర్లు, 27 లక్షల 4 వేల 394 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలానే146 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. తుది విడత పంచాయతీ ఎన్నికల కోసం 36 వేల 483 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎన్నికలు జరుగనున్న గ్రామాల్లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తుది విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది. 2గంటల నుంచి కౌంటింగ్ జరిగిప ఫలితాలు ప్రకటిస్తారు. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దుమ్మురేపింది. మొత్తం 4,333 స్థానాల్లో సగాని కంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమురం భీం, జనగామ, నిర్మల్ జిల్లాల మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన వారే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. తొలి విడత మాదిరిగానే రెండో విడతలోనూ ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజారిటీ స్థానాలు వచ్చాయి. మూడో విడతలో మొత్తం 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని, పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయాలు సాధిస్తుండగా.. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. అంతేకాకుండా.. కొన్ని కొన్ని చోట్ల ఓట్లు సమంగా రావడంతో అభ్యర్థులు చివరకు టాస్ తో విజయం సాధిస్తున్నారు.


