మేడిగడ్డ నిర్మాణంలో లోపాలు లేవు

` ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది
` ఏడో బ్లాక్‌లో సమస్య రావడం వల్ల సెంటర్‌ పియర్‌ కుంగింది
` ఇసుక వల్ల సమస్య వచ్చిందని భావిస్తున్నాం
` నవంబరు చివరలో సమగ్ర పరిశీలన జరుపుతాం
` నీటి పారుదల శాఖ జనరల్‌ ఈఎన్‌సీ మురళీధర్‌
` రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో ముగిసిన కేంద్ర బృందం భేటీ
` బ్యారేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర బృందం
హైదరాబాద్‌(జనంసాక్షి): మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవని నీటి పారుదల శాఖ జనరల్‌  ఈఎన్‌సీ మురళీధర్‌ అన్నారు. కానీ ఎక్కడో చిన్న పొరపాటు అయితే జరిగిందని అనుమానించారు. ఏడో బ్లాక్‌లో సమస్య వల్ల సెంటర్‌పియర్‌ కుంగిందని అన్నారు. ఇసుక వల్ల సమస్య వచ్చిందని అనుకుంటున్నామని అనుమానం వ్యక్తం చేశారు. క్వాలిటీ ఆఫ్‌ సాండ్‌, క్వాలిటీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ అనుమతులు ఉన్నాయన్నారు. కాపర్‌ డ్యామ్‌కు వరద తగ్గాక నవంబరు చివరలో సమగ్ర పరిశీలన జరుపుతామని తెలిపారు. మేడిగడ్డ ఆనకట్ట పిల్లర్‌ కుంగుబాటులో ఎలాంటి కుట్రకోణం లేదన్న రాష్ట్ర నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌.. ఫౌండేషన్‌ కింద ఇసుక కదలిక వల్లే సమస్య వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపం లేదన్నారు. ఆనకట్ట కుంగిన వైపు ఇప్పటికే నీటి ప్రహావాన్ని తగ్గించారు. ఆ వైపున ప్రవాహం పూర్తిగా తగ్గేలా అర్ధచంద్రాకారంలో కాఫర్‌ డ్యాం నిర్మించాలని భావిస్తున్నారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆనకట్టను మొత్తం ఎనిమిది బ్లాకులుగా విభజించి నిర్మించినందున కేవలం ఒక్క ఏడో బ్లాకుపైనే ప్రభావం ఉంటుందని… ఇతర బ్లాకులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని అంటున్నారు. నీటి నిల్వ సామర్థ్యం కొంత మేర తగ్గుతుందని, అయితే పంపులు ఎత్తిపోసేందుకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్తున్నారు. మేడిగడ్డ ఆనకట్ట అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో సమావేశమైంది. కేంద్ర జల సంఘం చీఫ్‌ ఇంజినీర్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌ జలసౌధలో ఇంజినీర్లతో సమావేశమైంది. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ జనరల్‌? ఈఎన్‌సీ మురళీధరన్‌ ఓ అండ్‌ ఎం ఈఎన్‌సీ నాగేందర్‌ రావు, కాళేశ్వరం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌ పాండే, ఇంజినీర్లు, ఎల్‌అండ్‌ టీ సంస్థ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.  ఆనకట్ట కుంగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంజినీర్ల కమిటీ.. మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. మేడిగడ్డ ఆనకట్ట, కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ఇంజినీర్ల ద్వారా వివరాలు తీసుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఇంజినీర్లతో సమావేశమయ్యారు. ఆనకట్టకు సంబంధించిన నిర్మాణ ప్రక్రియ, తీసుకున్న జాగ్రత్తలు, సాంకేతిక అంశాలు, కుంగిపోవడానికి గల కారణాలు సహా అనేక అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయి పరిశీలన, ఇంజినీర్ల సమావేశం ఆధారంగా కేంద్ర బృందం నివేదిక సమర్పించనుంది.
మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణ నాణ్యతపై కేంద్ర బృందం క్షుణ్ణంగా పరిశీలన
హైదరాబాద్‌,అక్టోబర్‌25(ఆర్‌ఎన్‌ఎ):మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణ నాణ్యతపై కేంద్ర బృందం విచారణ నిర్వహించింది. క్షేత్ర స్థాయిలో పనుల పరిశీలన కోసం నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు రంగంలోకి దిగారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కేంద్ర అధికారుల బృందం పర్యటిస్తోంది. మేడిగడ్డలో కుంగిన పిల్లర్స్‌ను నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలించారు. మరికాసేపట్లో హైదరాబాద్‌ జల సౌధాలో రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ అధికారులతో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో భేటీ జరగనుంది. జలసౌధలో రాష్ట్ర ఇరిగేషన్‌ అధికారులతో భేటీ కానున్నారు. రాష్ట్ర ఇరిగేషన్‌ అధికారులు, కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులతో చర్చ నిర్వహించనున్నారు. సాంకేతిక వివరాలను కేంద్ర బృందం అడిగి తెలుసుకోనుంది. భేటీ తరువాత కేంద్రానికి తమ నివేదికను కేంద్ర బృందం సమర్పించనుంది.