మొగుడుపెళ్లాం మధ్య బలవంతపు శృంగారం నేరం కాదు


ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు తీర్పు
ముంబై,ఆగస్ట్‌13(జనంసాక్షి): మూడుముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం నేరం కానేకాదని ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. పైగా, భార్య పెట్టిన వేధింపులు కేసులో భర్తకు ముందస్తు బెయిల్‌ కూడా మంజూరు చేసింది.
తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర రాజధాని ముంబై నగరానికి సమీపంలో ఉన్న మహాబలేశ్వర్‌కు చెందిన ఓ మహిళకు మరో వ్యక్తితో గత యేడాది నవంబరు 22వ తేదీన వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన నాటి నుంచి ఆ మహిళను.. ఆమె భర్తతో సహా కుటుంబ సభ్యులంతా కలిసి కట్నం కోసం హింసకు గురిచేస్తున్నారట.అంతేకాకుండా, కట్టుకున్న భర్త కూడా తనకు ఇష్టంలేకపోయినా బలవంతంగా సెక్స్‌లో పాల్గొంటున్నట్టు ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనివల్ల తనకు నడుము కింది భాగంలో పక్షవాతం వచ్చినట్టు తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో ఆ మహిళ భర్త తనకు ముందస్తు బెయిల్‌ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును తాజాగా ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు విచారించింది. భార్యభర్తల మధ్య బలవంతపు సెక్స్‌ చట్టవిరుద్ధం కాదని ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు స్పష్టం చేస్తూ భర్తకు ముందస్తు బెయిల్‌ మంజూరుచేసింది.